భూగర్భ జలాల పెంపే లక్ష్యం | the target is underground water | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాల పెంపే లక్ష్యం

Jul 9 2014 1:58 AM | Updated on Sep 2 2017 10:00 AM

భూగర్భ జలాల పెంపే ప్రధాన లక్ష్యంగా ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్‌లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమాలను చేపట్టాలను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

కర్నూలు(కలెక్టరేట్): భూగర్భ జలాల పెంపే ప్రధాన లక్ష్యంగా ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్‌లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమాలను చేపట్టాలను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో వీటి ద్వారా ఎటువంటి పనులు చేపట్టాలనే అంశంపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్‌కు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

ఇందుకు అనుగుణంగా గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. భూగర్భ జలాల అభివృద్ధి, మొక్కలు నాటి పెంచడం, వ్యవసాయం, మల్బరీ, ఫిషరీస్‌తో అనుసంధానం చేయడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, పశుగ్రాసాల పెంపకం, పశువులకు నీటి తొట్ల నిర్మాణం వంటి పనులతో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భూగర్భ జలాల అభివృద్ధికి చెక్‌డ్యామ్‌లు, చెక్‌వాళ్లు, ఫాంఫాండ్‌లు, నీటి కుంటలు తదితర వాటిని పెద్ద ఎత్తున నిర్మించాలని వెల్లడించారు. చేలగట్లు, రోడ్ల వెంట మొక్కలు నాటి పెంచాలన్నారు.

గ్రామం యూనిట్‌గా ఈ పనులన్నీ జరిగేలా చూడాలన్నారు. ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. హౌసింగ్‌లో 90 రోజుల పని దినాలను కల్పించాలని స్పష్టం చేశారు. పంటల కోత తర్వాత ఆరబెట్టుకునేందుకు డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లు, గోదాములు కూడా నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ హరినాథరెడ్డి, అదనపు పీడీ విశ్వనాథరెడ్డి, ఏపీడీలు, తదితరులు పాల్గొన్నారు.

 వాటర్ షెడ్ కార్యక్రమాల అమలులో భాగస్వాములు కండి
  - ఎంపీటీసీ సభ్యులకు డ్వామా పీడీ పిలుపు
 కర్నూలు(కలెక్టరేట్): ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్ కార్యక్రమాల అమలులో ఎంపీటీసీ సభ్యులు భాగస్వాములు కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ హరినాథరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో డ్వామా హాల్‌లో వాటర్‌షెడ్ గ్రామాల ఎంపీటీసీ సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్‌లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లకు మంజూరు అవుతాయన్నారు.. ఈ నిధులను రాజకీయాలకు అతీతంగా వినియోగించుకుంటే గ్రామాలు అభివృద్ధి పథంలోకి వస్తాయన్నారు.

 సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు కలిసికట్టుగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఐడబ్ల్యూఎంపీ వాటర్ షెడ్‌ల ద్వారా ఎటువంటి పనులు నిర్వహిస్తారు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ఏ పనులకు అవకాశం ఉందో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీలు రసూల్, ఖాదర్ బాష, కోర్సు డెరైక్టర్ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement