హోదా ఇవ్వాల్సిందే | Special Discussion: AP needs Special Status | Sakshi
Sakshi News home page

హోదా ఇవ్వాల్సిందే

Feb 25 2018 1:13 PM | Updated on Mar 23 2019 9:10 PM

Special Discussion: AP needs Special Status - Sakshi

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా భిక్ష కాదు.. మన హక్కు అంటూ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు ఉద్ఘాటించాయి. నెల్లూరులో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో శనివారం ప్రముఖ పాత్రికేయులు కేఎస్సార్‌ నిర్వహించిన ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా కార్యక్రమంలో అనేక వర్గాల సామాన్య ప్రజలు నినదించారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, పదిహేనేళ్లు కావాలని ఎన్నికల ముందు గొంతెత్తి చాటిన చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే నిధులు దిగమింగడానికి హోదాతో వీలు పడదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే అవకాశం ఉంటుందని భావించారు. ప్రత్యేక హోదాకు సరిసమానంగా ప్యాకేజీ అంటూ ప్రజలను, హోదా ఉద్యమానికి నడుంబిగించిన విద్యార్థులను బెదిరించారన్నారు. హోదా అని రోడ్డు మీదకు వస్తే జైలుకే అంటూ హెచ్చరికలు చేశారన్నారు. ఆది నుంచి హోదా కోసం పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు గొంతెంతి నినదించడంతో చంద్రబాబు తన ఊసరవెల్లి వేషాలను మరోసారి చూపించారన్నారు. తప్పంతా బీజేపీ అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

జల్లికట్టు ఉద్యమాన్ని చూసి నేర్చుకోవాలి
మన పొరుగు రాష్ట్రంలో జల్లి కట్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమించి సాధించుకున్నారు. మన రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన ప్రత్యేక హోదా విషయంలో కొందరు డ్రామాలు ఆడుతుండడం అన్యాయం. మనలోనే పోరాటానికి ఐక్యత లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాలుగేళ్లు మౌనంగా ఉండి, హోదా ఉద్యమాలను అణచివేసి ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తోంది.
– చంద్రశేఖర్, ఎన్‌జీఓ

ఎన్‌జీఓలవి నకిలీ ఉద్యమం
 రాష్ట్రాన్ని విభజించే సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఎన్‌జీఓలు నకిలీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపారు. కమ్యూనిస్టులు కూడా తెలంగాణకే మద్దతిచ్చారు. ఇప్పుడు హోదా అంటూ మాట్లాడుతున్నారు. ఏపీకి హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తుంది. సీఎం చంద్రబాబు కూడా అప్పట్లో ప్యాకేజీ అని ఇప్పుడు యూ టర్న్‌ తీసుకున్నారు.   ఏ ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు.
– సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రజలను మోసం చేయలేరు
పార్లమెంట్‌లో చీకట్లో రాష్ట్ర విభజన చేశారు. విభజన హామీలను అమలు చేయలేదు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీతో చంద్రబాబు కోటరీ బాగుపడింది. ప్యాకేజీ జేబులో డబ్బు వంటిది ఖర్చు అయిపోతుంది. హోదా స్థిరాస్థి వంటిది భావితరాలకు ఉపయోగపడుతుంది. చంద్రబాబు డబ్బును దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారు. ప్రజలను మరోమారు మోసం చేసేందుకు టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి.     
– ఫణిరత్నం, బార్‌ అసోసియేషన్‌ నాయకులు  

హోదాతో కొత్త పరిశ్రమలు వస్తాయి
అందరు ఐకమత్యంగా ఉంటేనే ప్రత్యేక హోదా సాధించగలం. హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగ సమస్య తీరుతుంది. కొత్త పరిశ్రమలు వస్తాయి. రాజకీయ పార్టీలు అన్ని ప్రత్యేక హోదా పోరులో కలిసి పనిచేయాలి.
–పూజ, విద్యార్థిని

ఓట్ల కోసం డ్రామాలు
నాలుగేళ్లు మౌనంగా ఉన్న చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే హోదా డ్రామాలు ఆడుతున్నారు. తిరుపతిలో వెంకయ్యనాయుడు, చంద్రబాబు చెప్పిన మాటలు ఏమాయ్యాయి. ఆంధ్రుల అభిష్టాన్ని కాదని ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడం ఎవరికి లాభం. ప్యాకేజీ ఏపీకి అవసరం లేదు. మనకు కావాల్సింది ప్రత్యేక హోదా మాత్రమే. అందరం కలసి సాధించుకుందాం.
– పనబాక కృష్ణయ్య,  డీసీసీ అధ్యక్షుడు

హోదా వస్తే రైతులకు మేలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. వాటిలో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు కూడా రావచ్చు. దీంతో ప్రస్తుతం కష్టాల్లో ఉన్న రైతులకు కొంత మేలైనా జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి రైతులు ఎంతో ముఖ్యం. అందుకే అందరం కలిసి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు గిల్లికజ్జా గొడవలు ఆపి, ప్రజల ప్రయోజనాలకు పట్టం కట్టాల్సిందే.
– సీహెచ్‌ కోటిరెడ్డి, రైతు సంఘం నాయకుడు

ఎన్నికల కోసమే టీడీపీ తెరపైకి హోదా అంశం
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు మరో మారు అధికారం కోసం ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రానికి హోదా అవసరం లేదన్నా టీడీపీ హోదాపై కూనిరాగాలు తీస్తున్నాయి. మరో పక్క సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.  ప్రత్యేక హోదా వస్తే వెనుకబడిన ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
– బసిరెడ్డి నారాయణరెడ్డి, ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా అధ్యక్షుడు

ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా అనేది ఆంధ్రల హక్కు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తునే ఉన్నాం. భవిష్యత్‌ తరాలు బాగుండాలంటే హోదా కావాలి. హోదా పోరులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.
– జి.మమత, విద్యార్థిని

టీడీపీ, బీజేపీ ఇద్దరే బాధ్యులు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుంటే అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీలే బాధ్యత వహించాలి. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎన్‌జీఓల తరపున ఎన్నో ఉద్యమాలు చేశాం.  ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇరు పార్టీలు తిట్టుకుంటున్నాయే తప్ప ఏమి సాధించాయో చెప్పలేక పోతున్నారు. ప్రధానంగా చెప్పాలంటే అప్పటి కాంగ్రెస్, ఇప్పటి బీజేపీ, టీడీపీలే ఆంధ్రప్రదేశ్‌ నాశనానికి కారకులే.
– చొప్పా రవీంద్రబాబు, ఎన్‌జీఓ నాయకులు

హోదా కోసం పోరాడుదాం
ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యం. కొందరు ప్యాకేజీ అంటూ కాసేపు, వద్దు హోదా అని మరి కొన్ని రోజులు ఈ విధంగా మాట్లాడుతుండటం సిగ్గుచేటు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్పార్‌సీపీ పోరాటం చేస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా కల్పించాలి. అందరం కలిసి హోదాను సాధించుకుందాం.
– కోడూరు కల్పలత, గూడూరు

ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు
తెలుగువారి ఆత్మగౌరవాన్ని దివంగత ఎన్‌టీఆర్‌ కాపాడితే, చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీకి తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా కోసం ‘సాక్షి’ చర్చావేదిక నిర్వహించడం అభినందనీయం. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంతోపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలి. హోదా కోసం అఖిలపక్షంగా కలిసి పోరాటం చేద్దాం
–పి.లీలామోహన్, సీపీఐ నేత

ఇక్కడ చదువుకున్న వారికి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి
రాష్ట్రంలో చదువుకునే వారి సంఖ్య పెరిగింది. ఉద్యోగాల కోసం పోరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ చదువుకున్న వారికి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. అనేక పరిశ్రమలు వస్తాయి. ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది.         
ఇమ్రానా, విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement