హైదరాబాద్‌కు భారీగా తరలిన ఉద్యోగులు | Seemandhra Government employees move to attend for AP NGOs Meeting | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు భారీగా తరలిన ఉద్యోగులు

Sep 7 2013 6:40 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఏపీ ఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు జిల్లా నుంచి సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఎన్‌జీవోలు సుమారు 3 వేల మంది, ఇతర ఉద్యోగులు సుమారు 2 వేల మంది హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం


 ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఏపీ ఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు జిల్లా నుంచి సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఎన్‌జీవోలు సుమారు 3 వేల మంది, ఇతర ఉద్యోగులు సుమారు 2 వేల మంది హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. సభలో పాల్గొనేందుకు ఒక్క ఒంగోలు నుంచే 2 వేల మందికిపైగా ఉద్యోగులు బస్సులు, కార్లు, సుమోల్లో వెళ్లారు. కందుకూరు, మార్కాపురం, చీరాల, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, పొదిలి తదితర ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కూడా వెళ్లారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేశవరపు జాలిరెడ్డి వాహనాలు ఏర్పాటు చేశారు.  
 
 సగం విజయం సాధించాం : బషీర్
 హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ద్వారానే తాము అనుకున్న కార్యంలో సగం విజయం సాధించినట్లయిందని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ అన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు చేసిన కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. సభ నిర్వహించుకునేందుకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వటం దురదృష్టకరమన్నారు.రాష్ట్ర రాజ ధానిలో తమ భావాలను స్వేచ్ఛగా చెప్పుకునేందుకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించటాన్ని ఆయన తప్పుపట్టారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగులపై భౌతికదాడులకు పూనుకుంటామని, సభను అడ్డుకుంటామని, పెట్రోలు పోసి తగలబెడతామంటూ తెలంగాణ వాదులు చేస్తున్న బెదిరింపులకు బెదిరేది లేదని బషీర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో సభ నిర్వహించి తమ సత్తా చాటుతామన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement