సత్యవతికి సాహిత్య అకాడమీ అవార్డు

Sahitya Akademi Award To Satyavati - Sakshi

2019కిగాను అనువాద విభాగంలో ఎంపిక

‘ఒక హిజ్రా ఆత్మకథ’ అనువాదానికి జాతీయ గుర్తింపు

సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ కల్చరల్‌: విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి నుంచి 2017 డిసెంబరు వరకు అనువాదం చేసిన రచనల ఆధారంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 23 భాషల్లో అనువాదాలను ఎంపికచేయగా.. 23 మంది అనువాద రచయితలను ఈ అవార్డు వరించింది. ‘ది ట్రూత్‌ అబౌట్‌ మీ : ఏ హిజ్రా లైఫ్‌ స్టోరీ’ అనే ఆంగ్ల ఆత్మకథను సత్యవతి తెలుగులో ‘ఒక హిజ్రా ఆత్మకథ’గా అనువదించారు. దీనికే ఈ పురస్కారం లభించింది.

ఆమె రాసిన ‘వాటిజ్‌ మై నేమ్‌’ కథ పదో తరగతిలో పాఠ్యాంశంగా.. ‘విల్‌ హీ కమ్‌ హోం’ కథ ఇంటర్‌లో పాఠ్యాంశంగా ఉన్నాయి. ఆమె 200కు పైగా కథలు, అనేక నవలలు రచించారు. ఆమె 1940లో గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమె తొలి కథ తెలుగు స్వతంత్ర మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. పి.సత్యవతి కథలు, ఇల్లు అలకగానే.., మంత్రనగరి వంటి కథా సంపుటాలు, ఐదు నవలలను ఆమె రచించారు. అనేక కథలను కూడా అనువదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాదికి ప్రదానం చేసే కళారత్న (హంస) పురస్కారం, పెద్దిభొట్ల స్మారక పురస్కారంతోపాటు వివిధ సంస్థలు సత్యవతికి అనేక పురస్కారాలు అందించాయి. మరోవైపు.. శప్తభూమి రచయిత బండి నారాయణస్వామి మంగళవారం ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డును అందుకోనున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top