ఆర్టీసీలో ఇష్టారాజ్యం | Rtc work is impunity. The officer was nearly | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ఇష్టారాజ్యం

Aug 13 2013 6:18 AM | Updated on Sep 1 2017 9:49 PM

ఆర్టీసీలో ఇష్టారాజ్యంగా పనులు సాగుతున్నాయి. ఓ అధికారి ఏకంగా లక్షన్నర రూపాయలు తప్పుడు బిల్లులతో పొందారు. వివరాలు ఇలా ఉన్నాయి....

కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : ఆర్టీసీలో ఇష్టారాజ్యంగా పనులు సాగుతున్నాయి. ఓ అధికారి  ఏకంగా లక్షన్నర రూపాయలు తప్పుడు బిల్లులతో పొందారు. వివరాలు ఇలా ఉన్నాయి....నిజామాబాద్ ఆర్‌ఎం కార్యాలయంలోని ఓ అధికారిణి ఇటీవలే గోవా టూర్‌కు వెళ్లింది. ఆర్టీసీలో సంవత్సరానికి ఒకసారి అధికారి టూర్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఆర్టీసీ నుంచి టూర్‌కు సంబంధించి బస్ రీయింబర్స్‌మెంట్ కింద అలవెన్సు మంజూరు చేస్తారు. టూర్‌కు వెళ్లే ముందు 80 శాతం మంజూరు చేస్తారు. ఆ తర్వాత   బిల్లులు సమర్పిస్తే మిగతా 20 శాతం కూడా చెల్లిస్తారు. కాని ఇక్కడ అధికారులు ముందుగానే మొత్తం చెల్లింపులు చేసినట్లు తెలిసింది. ఎలాంటి పరిశీలన లేకుండానే డబ్బులు తీసుకున్నట్లు తేలింది. కండక్టర్ రూపాయి తక్కువగా ఇస్తే సస్పెన్షన్ చేసే అధికారులు ఇలా రూ.లక్షకు పైగా వదిలేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 
 ఆడిట్‌లో బట్టబయలు..
 బిల్లుల వ్వవహారం ఆడిట్‌లో తేలింది. కేవలం కంప్యూటర్ ద్వారా వచ్చిన టికెట్లను మాత్రమే సమర్పించారు. ఇది ఆర్టీసీలో నిబంధనల ప్రకారం  చెల్లవు.  అడిట్‌లో అధికారులు పరిశీలించడంతో వ్యవహారం బయటపడింది. దీంతో అధికారులు వెంటనే వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రీజినల్ అధికారులు రూ.లక్షన్నర రికవరీకి ఆదేశించారు. 
 
 రికవరీ చేశాం....
 అధికారి టూర్‌కు సంబంధించిన వ్యవహరంలో  బిల్లుల చెల్లింపులో  బోర్డింగ్ పాసులు లేవు. ముందస్తుగానే రూ.లక్షన్నర మంజూరు చేశాం. తరువాత ఆడిట్‌లో బోర్డింగ్ పాసులు లేవని తేలడంతో సంబంధిత అధికారి నుంచి రూ.లక్షన్నర రికవరీ చేశాం.
 రీజనల్ మేనేజర్ కృష్ణకాంత్
 

Advertisement

పోల్

Advertisement