ఏం కష్టమొచ్చిందో..! | produturu zone in three peoples death | Sakshi
Sakshi News home page

ఏం కష్టమొచ్చిందో..!

Dec 10 2014 2:55 AM | Updated on Aug 28 2018 7:08 PM

ఏం కష్టమొచ్చిందో..! - Sakshi

ఏం కష్టమొచ్చిందో..!

పాపం.. వారికి ఏమైందో.. ఏం కష్టమొచ్చిందో.. ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.

పాపం.. వారికి ఏమైందో.. ఏం కష్టమొచ్చిందో.. ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. ఒకరు పురుగుల మందు తాగితే.. మరొకరు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో సంఘటనలో ఇంకో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మూడు సంఘటనలు మంగళవారం ప్రొద్దుటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నాయి.
- ప్రొద్దుటూరు క్రైం
 
- ఎర్రన్నకొట్టాలలో
- యువకుడు ఆత్మహత్య..

ప్రొద్దుటూరు పట్టణం ఎర్రన్నకొట్టాలలో శివప్రసాద్(24)అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు.. కొర్రపాటి రామలింగయ్య ఎర్రన్నకొట్టాలలో నివాసం ఉంటున్నాడు. అతను మిల్లులో హమాలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కుమారులు కొర్రపాటి శివప్రసాద్, శివశంకర్‌లతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శివప్రసాద్ ఆటో నడుపుకునేవాడు.

ఇటీవల అతను మద్యానికి బాగా అలవాటు పడ్డాడు.  20 రోజుల నుంచి ఆటోకు వెళ్లలేదు. ఎందుకు ఆటోకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు అడిగినప్పటికీ అతను జవాబు ఇవ్వలేదు.  ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఫ్యాన్‌కు చీర చుట్టుకొని ఉరి వేసుకున్నాడు. మిల్లులోకి కూలి పనికి వెళ్లిన తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామలింగయ్య ఇంటికి రాగా కుమారుడు ఉరికి వేలాడుతున్నాడు.

కుమారుడిని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు గట్టిగా కేకలు వేశారు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొని శివప్రసాద్‌ను 108 వాహనంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.
 
పురుగుల మందు తాగి..  

ఆర్టీపీపీ రహదారిలోని పెన్నానదిలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతని పక్కనే పురుగుల మందు డబ్బా కూడా ఉంది. అదే సమయంలో ప్రొద్దుటూరు నుంచి కలమల్ల స్టేషన్‌కు వెళ్తున్న కానిస్టేబుళ్లు బాబాఫకృద్ధిన్, గురుభాస్కర్, అశోక్‌లు పెన్నా నదిలో పడిఉన్న అతన్ని గుర్తించారు.

కొన ఊపిరితో ఉన్న అతన్ని ముగ్గురు కానిస్టేబుళ్లు వెంటనే ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గ మధ్యంలో 108 అంబులెన్స్ రావడంతో అందులోకి మార్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను కొద్ది సేపటికే మృతి చెందాడు. రూరల్ సీఐ పురుషోత్తమరాజు, ఎస్‌ఐ చలపతిలు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహం ఆస్పత్రిలోని మార్చురీ గదిలో ఉంటుందని ఈ వ్యక్తికి సంబంధించిన బంధువులెవరైనా ఉంటే రూరల్ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ చలపతి తెలిపారు.
 
పాలిటె క్నిక్ కళాశాల ప్రాంగణంలో మరో వ్యక్తి..
కొర్రపాడు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహం ప్రధాన గేట్ వద్ద పడి ఉండటంతో విద్యార్థులు త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతనికి సుమారు 50 ఏళ్లు ఉంటాయని, చొక్కా కాలర్‌పై ఆయూబ్ టైలర్, బళ్లారి అనే లేబుల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement