అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా అమ్మటానికి వీలులేని భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు...
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి
ఆనందపేట (గుంటూరు): అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా అమ్మటానికి వీలులేని భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసి పైగా పరువు నష్టం దావా వేస్తానని బుకాయించడం హాస్యాస్పందంగా ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. గుంటూరు అరండల్పేటలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థపై పోలీసుల విచారణ కొనసాగుతున్నా ప్రభుత్వం అండదండలతో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు.
కంచే చేను మేసిన విధంగా బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తే ఇలా చేయడం తగదన్నారు. ప్రైవేటు వ్యక్తి ద్వారా భూములు కొనుగోలు చేశానని చెబుతున్న మంత్రి పుల్లారావు ఆ ప్రైవేటు వ్యక్తి ఎవరో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 2015లో అగ్రిగోల్డ్ సంస్థల డెరైక్టర్ అయిన ఉదయదినకర్ నుంచి భూములు కొనుగోలు చేశారని ఆయన వెల్లడించారు. పరువు నష్టం దావా వేస్తే ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ద్వారానే దీనిపై విచారణకు ఆదేశించాలని, తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకులు కొత్తా చిన్నప్పరెడ్డి, సయ్యద్ మాబు, నర్సిరెడ్డి, బండారు సాయిబాబు, రాచకొండ ముత్యాలరాజు, మురళి, మధు, రత్నబాబు, కంభా నాగేశ్వరరావు పాల్గొన్నారు.