వినీలాకాశంలో విహరించేలా..

Planetarium Will Be Set Up With 37 Crore On Visakha Kailasagiri - Sakshi

కైలాసగిరిపై ప్లానిటోరియం ఏర్పాటుకు శ్రీకారం 

రూ.37 కోట్లతో 7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 

ప్లానిటోరియం డిజైన్‌ కోసం పోటీ నిర్వహించిన వీఎంఆర్‌డీఏ

మొదటి స్థానంలో నిలిచిన డిజైన్‌ను ఖరారు చేసిన అధికారులు 

తుది మెరుగులు దిద్దేందుకు సీనియర్‌ ప్రొఫెసర్ల సలహాలు 

సాక్షి, విశాఖపట్నం: కైలాసగిరి.. మరింత శోభాయమానంగా రూపుదిద్దుకోనుంది. వినీలాకాశాన్ని నేలకు తీసుకొచ్చేలా అంతర్జాతీయ స్థాయి ప్లానిటోరియం నిర్మాణం కైలాసగిరికి మణిహారంలా మారనుంది. దీనికోసం ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం చేసిన వీఎంఆర్‌డీఏ.. సరికొత్త డిజైన్‌తో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అందాల విశాఖ నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడూ కైలాసగిరిని సందర్శిస్తాడు. విదేశాల నుంచి వచ్చే 10 మంది పర్యాటకుల్లో.. 8 మంది కైలాసగిరిని సందర్శిస్తుంటారని పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. గిరిపై నుంచి చూస్తే.. సాగర నగరి సొగసులు.. వయ్యారాలు ఒలకబోస్తున్న తీరం సోయగాలు మనసును కట్టిపడేస్తాయి. అలాంటి కైలాసగిరిపై వినూత్న ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్తులో విభిన్న పర్యాటక సొబగులద్దుకునేందుకు సిద్ధమవుతోంది. టూరిజం ఐకాన్‌గా కైలాసగిరిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కైలాసగిరి అభివృద్ధికి పూర్తి స్థాయి ప్రణాళికల్ని వీఎంఆర్‌డీఏ సిద్ధం చేసింది.  

తారలు దిగివచ్చి.. తళుక్కున కనిపిస్తే.. 
సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న కైలాసగిరిపై నుంచి విశాఖను చూస్తే.. సుందరంగా కనిపిస్తుంది. ఆకాశం అందినట్లుగా ఉంటుంది. మరి ఆ నింగిని తాకుతూ.. నక్షత్రాల మధ్య విహరించే అవకాశం వస్తే.. ఎంతో బావుంటుంది కదా.. ఆ స్వప్నం సాకారం చేసే ప్రాజెక్టు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయి సక్షత్రశాల నిర్మాణానికి కైలాసగిరి సిద్ధమవుతోంది. రూ.37 కోట్ల వ్యయంతో ప్లానిటోరియం నిర్మించేందుకు వీఎంఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందు కోసం 7 ఎకరాల స్థలాన్ని కొండపై గుర్తించింది. హైబ్రిడ్‌ ప్రొజెక్షన్లు, 3డీ డిజిటల్‌ ప్రొజెక్టర్‌తో 200 మంది కూర్చొని వీక్షించేలా ప్లానిటోరియం నిర్మించనున్నారు. ప్రదర్శన ప్రారంభమైన వెంటనే నక్షత్రాల నడుమ మనం విహరించే అనుభూతిని 3డీ టెక్నాలజీ కలిగించనుంది. కేవలం ప్లానిటోరియం మాత్రమే కాకుండా...  గ్రహాలు, నక్షత్రాలు, సౌరమండలం, ఉపగ్రహాలు.. ఇలా.. సౌర కుటుంబంలోని ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించేలా చుట్టూ వివరాలు తెలుసుకునేలా చిత్రాలు, వివరాలు ఏర్పాటు చెయ్యనున్నారు. 

అంతర్జాతీయ హంగులతో..  
‘పదే పదే నిర్మించం కదా.. అందుకే.. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు ప్రయత్నించండి..’’ ప్లానిటోరియం నిర్మాణంపై వీఎంఆర్‌డీఏ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్లానిటోరియం నిర్మించేందుకు వివిధ అంతర్జాతీయ స్థాయి నక్షత్రశాలల్ని అధికారులు పరిశీలించారు. మంగుళూరులోని పిలుకుల ప్రాంతీయ సైన్స్‌ సెంటర్‌ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో మొదటి త్రీడీ ప్లానిటోరియంమైన మంగుళూరు కేంద్రాన్ని కొద్ది నెలల క్రితం వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు బృందం పరిశీలించింది. సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ తీరుని సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మంగుళూరుకి మించి అంతర్జాతీయ హంగులతో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. త్రీడీ షో తో పాటు.. ప్లానిటోరియంలో కాఫీ షాప్, సావనీర్‌ షాపింగ్‌ని ఏర్పాటు చేయనున్నారు.
 
కొత్త అనుభూతి అందించనున్న త్రీడీ ప్రొజెక్షన్‌ షో 

డిజైన్‌ కోసం కసరత్తు 
కైలాసగిరిపై నిర్మించనున్న ప్లానిటోరియంను సరికొత్త డిజైన్‌లో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం.. ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పనకు కోల్‌కతా ఎన్‌సీఎస్‌ఎం డైరెక్టర్‌ జనరల్‌ అరిజిత్‌ దుత్తాచౌదరి నేతృత్వంలో నలుగురు నిపుణుల బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ డీపీఆర్, డిజైన్ల రూపకల్పనకు కైలాసగిరిపై ప్లానిటోరియం నిర్మాణానికి అనువైన స్థల గుర్తింపుతో పాటు కావాల్సిన పరికరాలు, ఐకానిక్‌ బిల్డింగ్, ఇతర సాంకేతికాంశాల విషయాలపై సూచనలు చేసింది. ఆ కమిటీ సూచించిన అంశాల ప్రకారం ప్లానిటోరియం డిజైన్ల కోసం వీఎంఆర్‌డీఏ పోటీ నిర్వహించింది. అర్హత గల ఆర్కిటెక్ట్‌ సంస్థల నుంచి డిజైన్లను ఆహా్వనించింది. 66 ఆర్కిటెక్ట్‌ సంస్థలు పోటీ పడ్డాయి. 13 సంస్థలు మాత్రమే డిజైన్లు, ఇతర పత్రాలు సమరి్పంచాయి. వీటిలో ప్రథమ బహుమతి పొందిన స్టూడియో ఎమర్జెన్స్‌ సంస్థ రూపొందించిన డిజైన్‌ని ఎంపిక చేసి.. దాని తరహాలో ప్లానిటోరియం నిర్మించాలని నిర్ణయించారు. 

నిపుణుల కమిటీ సూచనలతో... 
ప్రాథమికంగా డిజైన్‌ను ఎంపిక చేసినప్పటికీ.. దీని సాధ్యాసాధ్యాలపై వీఎంఆర్‌డీఏ తీవ్ర కసరత్తు చేస్తోంది. డిజైన్‌లో మార్పులు చేర్పులు, ఇంజినీరింగ్‌ స్ట్రక్చరల్‌ వ్యవహారాలపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లతో త్వరలోనే కమిటీ వేయనుంది. వీరంతా.. ఈ డిజైన్‌లో మార్పులు చేసి.. ప్లానిటోరియంకు తుది రూపు తీసుకురానున్నారు. 

గొప్ప అనుభూతిని అందించేలా... 
కైలాసగిరిపైకి వచ్చే సందర్శకులకు గొప్ప అనుభూతిని అందించే విధంగా ప్లానిటోరియం  నిర్మించాలని సీఎం సూచించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా డిజైన్ల కోసం పోటీ నిర్వహించాం. ఎంపిక చేసిన డిజైన్‌లో మార్పులు చేర్పుల్ని నిపుణుల కమిటీ ద్వారా ఫైనలైజ్‌ చేస్తాం. దేశీయ సందర్శకులే కాకుండా.. అంతర్జాతీయ పర్యాటకులకూ సరికొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయతి్నస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో ప్లానిటోరియంలు ఉండొచ్చు. కానీ.. కైలాసగిరిపై ఏర్పాటుకానున్న ప్లానిటోరియం వాటన్నింటికంటే విభిన్నమైందిగా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతం. 
– పి.కోటేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top