
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నవ వత్సరానికి జిల్లా వాసులు సాదర స్వాగతం.. 2019 ఎన్నికల ఏడాది అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. బాణ సంచా పేల్చారు. కేక్లు కట్ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. ఆబాలగోపాలం నూతన సంవత్సర వేడుకల్లో పాలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నూతన ఏడాది అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ నేతలను కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ప్లెక్సీల పండుగ జోరుగా సాగింది. మొత్తంగా న్యూఇయర్ స్వాగత సంబరాలు వాడవాడలా మిన్నంటాయి.
ఈ ఏడాది ప్రారంభంలోనే జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి. అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి. వరుణుడు కరుణించాలి. వరుస కరువులు తీరేలా వానలు హోరెత్తాలి. ప్రాజెక్టులు పూర్తికావాలి. సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగాలి. ఒంగోలు గిత్తలు రంకేయాలి. జిల్లా పచ్చని పంటలతో కళకళలాడాలి. గిట్టుబాటు ధరలు రావాలి.. అన్నదాతలతో పాటు అందరి కష్టాలు తీరాలి.. పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరగాలి. అర్హులకు పెన్షన్లు, రేషన్ కార్డులు, పక్కా గృహాలు అందాలి. అన్నదాతలకు పెట్టుబడి నిధి రావాలి. గిట్టుబాటు ధర కావాలి. ప్రకృతి విపత్తుల పరిహారం అందాలి. పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు విద్య అందాలి. మహిళల అభివృద్ధికి అన్ని విధాలా సహకార మందాలి. అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు దక్కాలి. సంక్షేమం, అభివృద్ధి జరగాలి.
వెలిగొండను అధికారపార్టీ పెద్దలకు నిధులు తెచ్చిపెట్టే ధనాగారంగా కాక జిల్లా వాసులకు సాగు–తాగునీరిచ్చే ప్రాణదాతగా చూడాలి. కొత్త ఏడాదిలో నిదులిచ్చి.. నీల్లిచ్చేలా ప్రభుత్వం ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర రావాలి. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పబడాలి. జిల్లాలోని అన్ని సమస్యల పరిష్కారానికి కొత్త ఏడాదిలో ముందడుగు పడాలి. ప్రకాశంలో వెలుగులు ప్రకాశించేలా కొత్త ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇదే అందరి ఆశ, ఆకాంక్ష ఆ ఆశతోనే కొత్త ఏడాదిలోకి ముందడుగు వేద్దాం...!
వైఎస్సార్ సీపీలో కొత్త ఏడాది జోష్
ఎన్నికల ఏడాది ప్రారంభం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో నేతలు, క్యాడర్లలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ప్రత్యేకించి జిల్లాలో ఆ పార్టీకి తిరుగులేని ఆదరణ ఉంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పార్టీ శ్రేణుల్లో భరోసా నింపింది. జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలు క్షేత్ర స్థా«యికి వెళ్లాయి. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమ, అభివృద్ధి నవరత్నాల పథకాల ద్వారా సాకారమవుతుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలు ఆపార్టీపై ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చాయి. ఇది వైఎస్సార్ సీపీకి మరింతగా కలిసి వచ్చే అంశం. ఈ ఉత్సాహానికి కొత్త ఏడాది తోడైంది. ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరగనుండడంతో పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. దీంతో నూతన సంవత్సర వేడుకలను కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలతో హోరెత్తించారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి చో ఫ్లెక్సీల పండుగ జోరుగా సాగింది. మరోవైపు అధికార టీడీపీతో పాటు మిగిలిన పార్టీల్లో ఉత్సాహం కొరవడింది. ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా బయట పడుతుండడంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం నీరు కారిపోయింది. వారు డీలా పడ్డారు. ఓటమి భయం వారిని వెంటాడుతోంది. దీంతో నూతన సంవత్సర వేడుకల్లో వారి జోష్ తగ్గింది.