ఏపీ రాజ్భవన్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
సాక్షి, విజయవాడ : రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డాలర్ శేషాద్రిలు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ విశ్వభూషణ్కు టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.
అంతకు ముందు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అందరూ అభివృద్ధి సాధించాలని, జగన్నాథస్వామి, తిరుమల వెంకటేశ్వరస్వామి, కనకదుర్గమ్మ చల్లని దీవెనలతో రాష్ట్రమంతటా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.