‘మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు’

MRPS Leaders Fires On Manda Krishna Madiga - Sakshi

మందకృష్ణపై ఎమ్మార్పీఎస్‌, గిరిజన సంఘాల నేతల ఫైర్‌

సాక్షి, విజయవాడ :  ఉద్యమాల పేరుతో మాదిగల ఆత్మ గౌరవాన్ని రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టాడు అంటూ మంద కృష్ణ మాదిగపై ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చర్చలు జరపకుండా అసెంబ్లీని ముట్టడి చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడం సరికాదని విమర్శలు గుప్పించారు. మందకృష్ణ మాదిగ అసెంబ్లీ ముట్టడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఏపీ ఎమ్మార్పీఎస్‌, గిరిజన సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...రాష్ట్రంలో మందకృష్ణ ఆటలు సాగన్విమన్నారు. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న ఏపీ గిరిజన సంఘాల జేఏసీ నాయకులు పాలకీర్తి రవి మాట్లాడుతూ... 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఎల్లప్పుడు తన కులం వారికే పెద్ద పీట వేశారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలకు మాదిగలను దూరం చేసేందుకే మందకృష్ణ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి ఖబర్దార్‌ మందకృష్ణ అంటూ హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top