
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారానికి జీకే మహేశ్వరి కుటుంబసభ్యులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ప్రవీణ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ పురుషోత్తం, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో సీజే జేకే మహేశ్వరి,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.
జస్టిస్ మహేశ్వరి నేపథ్యం..
జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు సీజేగా 2023 జూన్ 28న పదవీ విరమణ చేస్తారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)