ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.
సాక్షి నెట్వర్క్: ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. విజయనగరంలోని పూసపాటిరేగ, భోగాపురంలో 4 నుంచి 6 సెంటీమీటర్లు వర్షం కురిసింది. పార్వతీపురం డివిజన్లో సాలూరులో గంటపాటు భారీవర్షం పడింది. విశాఖపట్నంలోని కోట ఉరట్లలో అత్యధికంగా 13 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదుకాగా.. ఐదు మండలాల్లో ఎలాంటి వర్షపాతం కురవలేదు. భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమై కలెక్టరేట్తోపాటు ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. బుధవారం కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది.
విజయవాడలో భారీ వర్షం పడింది. రెడ్డిగూడెంలో అత్యధికంగా 75.8 మిల్లీమీటర్లు కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 6.0 మిల్లీమీటర్లుగా నమోదైంది. గడచిన 24 గంటల్లో తునిలో 11 సెం.మీ., కొయ్యలగూడెంలో 9, పోలవరం, తెర్లాంలలో 7, పాలేరు, పగిడ్యాల, శ్రీశైలంలలో 6, ప్రత్తిపాడు, ఆత్మకూరులలో 5, నందిగామ, మార్కాపురంలలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది.