ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం: ‘నా నడుములు విరిగిపోయాయి.. గట్టిగా పది నిమిషాలు నిలబడటం కూడా నా వల్ల కాదు.. అయినా సరే రాజన్నబిడ్డ పాదయాత్ర చేస్తుంటే నా ప్రాణం ఆగలేదు.. అందుకే ఆయన అడుగులో అడుగేసుకుంటూ వచ్చా.. వికలాంగుడినన్న సంగతే మర్చిపోయి 12 కిలోమీటర్లు నడిచేశా’.. అంటూ ఒకింత ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఎల్లయ్య. శనివారం ఉదయం ప్రజాసంకల్ప పాదయాత్ర వెల్దుర్తిలో ప్రారంభమై చెరుకులపాడుకు చేరుకుంది. అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడవడం ప్రారంభించిన ఎల్లయ్య కృష్ణగిరి వరకూ వచ్చేశారు. తనకు పదేళ్ల కిందట తీవ్ర జ్వరం వచ్చి నడుములు చచ్చుబడ్డాయని, అప్పటి నుంచి పది నిమిషాలు కూడా నిలబడలేని తను రాజన్న బిడ్డ వెంట అడుగులేస్తూ 12 కిలోమీటర్లు నడవగలిగానని ఆనందం వ్యక్తంచేశారు.


