జానపద సంగీతనృత్యాల్లో శ్రావ్యమైన సంగీతం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: జానపద సంగీతనృత్యాల్లో శ్రావ్యమైన సంగీతం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్నారు. కిన్నెర సంస్థ 36 వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో ఆంధ్రప్రదేశ్ జానపద సంగీత నృత్యోత్సవాలు ‘ఘంటసాల’ వేదికపై ఘనంగా ప్రారంభమయ్యాయి. జస్టిస్ నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమాజాన్ని ప్రతిబింబించే అంశాలు జానపదాల్లో ఉండేవని, వాటిని అందరూ వల్లెవేసేవారని చెప్పారు. రాష్ట్రంలో ఐదు దశాబ్దాలుగా జానపద కళలు నిరాదరణకు గురయ్యాయని, ప్రభుత్వం పెద్దగా సాయం చేయకున్నా కిన్నెర వాటిని ప్రోత్సహిస్తోందని అన్నారు. నృత్యోత్సవాల్లో జానపద బ్రహ్మ పీవీ చలపతిరావు, మాపల్లె శంకర్ బృందాలు పాడిన జానపద గీతాలు శ్రోతలను అలరించాయి. విశ్రాంత డీజీపీ డాక్టర్ ఆర్.ప్రభాకరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి.రమణాచారి, ఆంధ్రా బ్యాంక్ జీఎం టీవీఎస్ చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.