భగవంతుని సేవతోనే జీవిత సాఫల్యం | Gods service for the God bless | Sakshi
Sakshi News home page

భగవంతుని సేవతోనే జీవిత సాఫల్యం

May 2 2015 4:32 AM | Updated on Sep 3 2017 1:14 AM

భక్తి శ్రద్ధలతో తాను చేసిన సేవలను భగవంతుడు గుర్తించి ఆయన సేవ చేసుకునే భాగ్యం కల్పించాడని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అభిప్రాయం వ్యక్తంచేశారు...

భక్తితత్వంతో ముందుకు సాగుతూ భగవంతుని సేవ చేసినప్పుడే జీవితం సాఫల్యమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమితులైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.  ఆయన శనివారం తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన భావాలను పంచుకున్నారు.

తిరుపతి కల్చరల్:  భక్తి శ్రద్ధలతో తాను చేసిన సేవలను భగవంతుడు గుర్తించి ఆయన సేవ చేసుకునే భాగ్యం కల్పించాడని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అభిప్రాయం వ్యక్తంచేశారు.  ప్రతిమనిషికీ జీవితంలో తల్లిదండ్రులు, గురు, దైవం  ప్రధానమన్నారు. వారికి నిస్వార్థంతో సేవలు అందించి ఆశీస్సులు పొందినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక ధార్మిక క్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రమనీ, ఈ క్షేత్రంలో భక్తకోటికి అందించే సేవల్లో తనను భాగస్వామిని చేయడం మహద్భాగ్యమన్నారు. వృత్తిపరంగా తాను వైద్యుడు అయినా భగవంతునికి, భక్తులకు సేవచేసే భాగ్యం లభించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు.  

భక్తి ప్రతి మనిషి జీవితాన్ని సుఖమయం చేసే చక్కటి మార్గమని తన నమ్మకమన్నారు. ఇందులో భాగంగానే 13 ఏళ్ల క్రితం  శ్రీవారి పాదాల చెంత వెలసిన తిరుపతి నగరంలో అడుగిడిన తనకు ఆ భగవంతుడు మంచి మార్గం చూపారన్నారు. ఆయన ఆశీస్సులతోనే సంతాన సంపద వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి  భక్తి తత్వాన్ని ప్రజల్లో నింపి సేవలు అందిస్తున్నారన్నారు.  టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా వచ్చిన అవకాశాన్ని ఆ భగవంతుని సేవకు అంకితం చేస్తానన్నారు.  నిస్వార్థంతో సేవలు చేపడుతూ హైందవ సంస్కృతి, సాంప్రదాయాలు పెంచే దిశగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.  

గ్రామీణ స్థాయిలో పురాతన ఆలయాలను పునరుద్ధరించి తద్వారా ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య, విద్య విభాగాల్లో సేవలను  మరింత  విస్తృతం చేసి ప్రజలకు చేరువ చేసేందుకు శ్రమిస్తానని తెలిపారు.  శ్రీవారి  దర్శనార్థం విచ్చేసే భక్తులు మొదట అడుగు వేసేది తిరుపతి నగరమేనన్నారు. తిరుపతిలో అడుగిడే ప్రతి భక్తుడిలో ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.  కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం నగరంలో, కాలినడక రహదారుల్లో భక్తి భావం కలిగించే విధంగా సరికొత్త కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆధ్యాత్మిక భావంతో తాను చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రజలు,  భక్తులు సహకారం అందించి ఆశీర్వదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement