మాటలే మిగిలాయి..

పెద్దగెడ్డ ప్రాజెక్ట్‌ నిర్వహణకు మంజూరు కాని నిధులు

వృథాగా పోతున్న నీరు

పట్టించుకోని అధికారులు, పాలకులు

ఆందోళనలో రైతన్నలు

సాలూరురూరల్‌ (పాచిపెంట): సాగునీటి ప్రాజెక్ట్‌లకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తాం.. రైతు సంక్షేమమే తమ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే టీడీపీ నాయకులు ఆచరణలో చేసి చూపించలేకపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలో నిర్మించిన ఎన్నో సాగునీటి ప్రాజెక్ట్‌లను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవు. మూడు కాలాల్లోనూ పంటలు పండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అప్పట్లో జలయజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నిర్మించి 2006లో ప్రారంభించారు.

సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ రిజర్వాయర్‌ నిర్మించి కుడి కాలువ ద్వారా 8500 ఎకరాలకు, కర్రివలస ఆనకట్ట ద్వారా 3500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్నాళ్లుగా ప్రాజెక్ట్‌ నిర్వహణను పట్టించుకోకపోవడంతో సమస్యలు మొదలయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖాలాలు లేవని వాపోతున్నారు.

అందని మెయింటినెన్స్‌ బిల్లులు
టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి పెద్దగెడ్డ ప్రాజెక్ట్‌ మెయింటినెన్స్‌ నిధులు మంజూరు కావడం లేదు. అయినప్పటికీ అటు అధికారులు గాని ఇటు పాలకులు గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రాజెక్ట్‌ పరిధిలో లష్కర్ల కొరత ఉంది. ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో 9 మంది లష్కర్లను నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారితోనే కాలం నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతమున్న వారికంటే రెట్టింపు సంఖ్యలో లష్కర్లు ఉండాలి. కాని ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించకపోవడంతో ఉన్నవారు ప్రాజెక్ట్‌ నిర్వహణను పక్కాగా చేపట్టలేకపోతున్నారు. షట్టర్లు పాడవుతున్నా మరమ్మతులు సకాలంలో చేయడం లేదు. ముఖ్యంగా పెద్దగెడ్డలో రెండు గేట్లు పాడవ్వడంతో మాన్యువల్‌ పద్ధతిలో పైకి లేపుతున్నారు. షట్టర్‌ అడుగున రబ్బర్‌ ఫిట్‌ చేయకపోవడంతో అడుగు నుంచి నీరు లీకవుతోంది. గురునాయుడుపేట ప్రాంత సమీపంలో ఉన్న 7ఎల్‌ లైన్‌ షట్టర్‌ పోయింది. ఇక్కడ కూడా నీరు వృథాగా పోతోంది.

స్పందించాలి
ప్రాజెక్ట్‌ అధికారులు, పాలకులు స్పందించి పెద్దగెడ్డ ప్రాజెక్ట్‌ నిర్వహణకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గ్రామాలకు వస్తున్న ప్రతిసారీ రైతుల గురించే ఆలోచిస్తున్నామని చెబుతున్న నాయకులకు నీటి వృథా కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top