నైరుతి నైరాశ్యం | formers feeling difficulties | Sakshi
Sakshi News home page

నైరుతి నైరాశ్యం

Jun 30 2014 2:31 AM | Updated on Sep 2 2017 9:34 AM

నైరుతి నైరాశ్యం

నైరుతి నైరాశ్యం

నైరుతి రుతుపవనాలు నైరాశ్యం కలిగిస్తున్నాయి. వాన చినుకు ‘అనంత’ నేలను తాకడం లేదు. విత్తుకునే సమయం దాటుతున్నా పంట సాగులో కదలిక లేదు.

అనంతపురం అగ్రికల్చర్ :  నైరుతి రుతుపవనాలు నైరాశ్యం కలిగిస్తున్నాయి. వాన చినుకు ‘అనంత’ నేలను తాకడం లేదు. విత్తుకునే సమయం దాటుతున్నా పంట సాగులో కదలిక లేదు. ఈ ఖరీఫ్‌లో 9,16,083 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేయగా అందులో కేవలం 23 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే విత్తుకున్నారు. అంటే మూడు శాతం విస్తీర్ణం మాత్రమే సాగులోకి వచ్చింది. వేరుశనగ    6,95,753 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 14 వేల హెక్టార్లలో మాత్రమే విత్తుకున్నారు. ఇందులో మొదట్లో కురిసిన వర్షాలకు రాప్తాడు మండలంలో 1,700 హెక్టార్లు, అమడగూరు మండలంలో 1,500 హెక్టార్లలో సాగయ్యింది.
 
 అమరాపురం, గుడిబండ, చిలమత్తూరు, కూడేరు, నల్లమాడ, పుట్టపర్తి, రొద్దం, అగళి, ఓడీ చెరువు, కనగాన పల్లి, కొత్తచెరువు, పెద్దవడుగూరు, బెళుగుప్ప, బుక్కపట్నం మండలాల్లో 220 నుంచి 950 హెక్టార్లలోపు వేరుశనగ వేసుకున్నారు. శింగనమల, తాడిపత్రి, పెద్దపప్పూరు, పుట్లూరు, యల్లనూరు, గుత్తి, కంబదూరు, డి.హిరేహాల్, గుమ్మఘట్ట, హిందూపురం, పరిగి తదితర మండలాల్లో ఒక్క ఎకరా కూడా వేరుశనగ సాగులోకి రాకపోవడం గమనార్హం. మిగతా పంటల విషయానికి వస్తే వరి 180 హెక్టార్లు, జొన్న 30, సజ్జ 710, మొక్కజొన్న 2 వేలు, రాగి 310, కంది 530, అలసంద 30, పొద్దుతిరుగుడు 550, ఆముదం 400, పత్తి 2,600 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. గతేడాది జూన్ నెలాఖరుకు 1.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ సారి ఆ పరిస్థితి లేకపోవడంతో ఖరీఫ్ పయనం ఎక్కడికి ‘సాగు’తుందో తెలియక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా 8.90 లక్షల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగులోకి రావాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement