'ఎక్స్ప్రెస్ వే, రింగ్ రోడ్ల పేరుతో కాజేస్తున్నారు'
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో గురువారం రైతాంగ పరిరక్షణ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న జొన్నలగడ్డలో రైతాంగ ప్రయోజనాల పరిరక్షణ సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. అవసరం లేకపోయినా ఎక్సప్రెస్ హైవే, రింగ్ రోడ్లు అంటూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూసేకరణ చేస్తోందని విమర్శించారు.
కడప-కర్నూలు నేషనల్ హైవే జరుగుతుంటే మళ్లీ అమరావతి - అనంతపురం హైవే అవసరం ఏంటని ప్రశ్నించారు. భూ సేకరణలు చేస్తూ ప్రభుత్వం తన స్వార్ధ ప్రయోజనాల కోసం రైతులను బలి చేస్తోందని మండి పడ్డారు. ప్రభుత్వ భూ సేకరణపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులు పండించే అన్నీ పంటలకు కనీసమద్దతు ధర చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ అవసరం లేకుండా రుణ ఉపశమన చట్టం తీసుకురావాలన్నారు.