విజయవాడలో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

Drug Mafia In Vijayawada Targetted As College Students - Sakshi

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ రాకెట్స్ విచ్చలవిడిగా తమ దందా కొనసాగిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడలో డ్రగ్స్‌ విక్రయించే ముఠా గుట్టురట్టయింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ, యువకులకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ హర్షవర్ధన్‌ రాజు వెల్లడించారు. డ్రగ్స్‌ ముఠా నుంచి 14 గ్రాములు డ్రగ్స్‌, రెండ్నుర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ ముఠా కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడికి చేసి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

పట్టుబడినవారిలో సూడాన్‌ దేశానికి చెందిన మహమ్మద్‌ గహేల్‌ రసూల్‌, టాంజానియా దేశానికి చెందిన లీశ్వ షాబాని ఉన్నారు. ముఠాలో అనంతకుమార్‌, శ్రీకాంత్‌ కీలకమైన వ్యక్తులుగా డీసీపీ పేర్కొన్నారు. ఈ ముఠా బెంగళూరులో రూ. 2000 నుంచి 2500కు డ్రగ్స్‌ కొనుగోలు చేసి ఇక్కడ రూ. 4000కు విద్యార్థులు విక్రయిస్తున్నారు. ఈ ముఠాపై గత కొంతకాలంగా నిఘా ఉంచామని ఇవాళ రెడ్‌ హ్యాండెడ్‌గా డ్రగ్స్‌తో పట్టుకున్నామని తెలిపారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల కదలికలపై దృష్టి సాధించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్‌కల్చర్‌ని విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని దీనిపై కళాశాలల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీసీపీ స్పష్టం చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top