
సాక్షి, పార్వతీపురం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ.. ప్రజలకు నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం జననేత పార్వతీపురం నియోజకవర్గంలోని తామరఖండి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జననేత రాక కోసం ప్రజలు వేచిచూస్తున్నారు.
హత్యాయత్నం జరిగిన తరువాత జననేత ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనే కోరికతో తామరఖండి కళాశాల విద్యార్థినిలు ప్రజాసంకల్పయాత్ర జరుగుతున్న చోటుకు తరలివచ్చారు. వైఎస్ జగన్ ఆరోగ్యం ఎలా ఉందో ప్రత్యక్షంగా చూడాలని అక్కడికి చేరుకున్న విద్యార్థినులు ఆయనను కలుసుకున్నారు. జననేతను ఆరోగ్యంగా చూసిన వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో తమ ప్రాంతం నుంచి బొబ్బిలి వరకు తగినని బస్సులు నడిచేవని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సులు లేక పది గ్రామాలకు చెందిన విద్యార్థులు కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వైఎస్సార్ సీపీలో చేరిన 2వేల మంది..
పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం, బలిజిపేట మండలల్లోని ఎనిమిది పంచాయితీలకు చెందిన నలుగురు సర్పంచ్లు, నలుగురు ఎంపీటీసీలు జననేత సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని జననేత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు రెండువేల మంది కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు.