ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్‌

CM YS Jagan Speech In Chittoor After Launch Amma Vodi Program Today - Sakshi

సాక్షి, చిత్తూరు: చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్న విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లలను బడికి పంపుతున్న ప్రతీ పేదింటి తల్లికి ఏటా 15 వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని.. తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నామని.. అయితే వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం అటెండన్స్‌ ఉంటేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరుతుందని... అర్హత ఉండి లబ్ది పొందని తల్లులు ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోవాలని సీఎం జగన్‌ విఙ్ఞప్తి చేశారు.అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం, ఆయాల జీతాల పెంపు, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పుల గురించి సీఎం జగన్‌ ప్రజలకు వివరించారు.

అప్పుతో సంబంధం లేదు..
‘అమ్మ ఒడి చిత్తూరులో ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ పథకం చిన్నారులు, వారి తల్లిదండ్రులకు అంకితం. నా పాదయాత్రలో అనేక విషయాలు తెలుసుకున్నా. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించాను. అందుకే అమ్మ ఒడి పథకం తీసుకువచ్చాం. ఈ పథకం కింద దాదాపు 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలకు మేలు చేకూరుతుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు వరుసగా ప్రతీ ఏడాది తల్లుల అకౌంట్‌లో పదిహేను వేలు జమ అవుతాయి. బ్యాంకుల్లో అప్పులు ఉన్నా వాటికి ఈ సొమ్మును జమచేయకుండా బ్యాంకర్లతో మాట్లాడాం. అప్పుతో సంబంధం లేకుండా డబ్బు తీసుకునేలా అధికారులతో మాట్లాడాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

అదేవిధంగా.. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం దిశగా అడుగేస్తున్నామని.. అయితే ఆంగ్ల మాధ్యమంపై ప్రజల ఆకాంక్ష చంద్రబాబుకు, సినిమా యాక్టర్‌కు పట్టడం లేదని సీఎం జగన్‌ విమర్శించారు. తెలుగు మీడియం కావాలనే నేతలెవరూ తమ పిల్లలను ఆ మీడియంలో చదివించడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టి.. ఆ తర్వాత ఒక్కో తరగతి చొప్పున ప్రవేశపెడుతూ...నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు. నాలుగేళ్లలో పిల్లలు బోర్డు పరీక్షలు ఇంగ్లీష్‌ మీడియంలో రాసే పరిస్థితి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలుగు మీడియం పిల్లలకి కొన్ని ఇబ్బందులు వస్తాయి గనుక.. వాటిని అధిగమించేలా బ్రిడ్జ్ కోర్సులు తీసుకుని వస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం శిక్షణా కోర్సులు ప్రవేశపెడతామన్నారు. తద్వారా 2040నాటికి మన పిల్లలు ప్రపంచలో ఎక్కడికైనా పోటీ పడగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ బడుల్లో సిలబస్ మార్చనున్నామని పేర్కొన్నారు.

సోమవారం అన్నం, పప్పుచారు.. ఆయాల జీతం పెంపు..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకువస్తున్న సీఎం జగన్‌ తెలిపారు. సోమవారం- అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, స్వీటు, చిక్కీ.. మంగళవారం- పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు... బుధవారం- వెజిటబుల్‌ రైస్‌, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ... గురువారం కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు.. శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్‌, చిక్కీ... శనివారం- అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగల్‌ ఉండేలా మెనూ రూపొందిస్తున్నాం. ఈ నేపథ్యంలో మెనూ మార్పు ద్వారా రూ. 200 కోట్లు అదనపు భారం పడుతుంది. అయినా పిల్లల కోసం ఆ ఖర్చును సంతోషంగా భరిస్తాం. దేశ చరిత్రలోనే పిల్లలు చదువుకోసం ఎవరూ ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదని అందరూ అంటున్నారు’సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా... మధ్యాహ్నం భోజనం పెట్టే ఆయాల జీతాలు వెయ్యి రూపాయల నుంచి రూ. 3 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా ఖజానాపై రూ. 160 కోట్లు అదనపు భారం పడుతుందని.. అయినప్పటికీ దానిని చిరునవ్వుతో స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.

విద్యా దీవెనతో పాటు.. వసతి దీవెన
మేనిఫెస్టోలో ఒకటి నుంచి పదో తరగతి వరకే అమ్మ ఒడి అమలు అవుతుందని పేర్కొన్నామని.. అయితే ఇప్పుడు ఇంటర్‌ వరకు ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక ఇంటర్‌ తర్వాత 75 శాతం మంది పిల్లలు చదువులు మానేస్తున్నారని.. అలాంటి వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదే విధంగా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు నాడు- నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పాఠశాలల పనితీరులో పిల్లల తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా పేరెంట్స్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాల బాగోగులపై ప్రతీ తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా విద్యా దీవెనతో పాటు వసతి దీవెనను కూడా తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఎంపీలు మిథున్‌ రెడ్డి, రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, ద్వారకనాథరెడ్డి, వెంకటేగౌడ, ఎంఎస్‌ బాబు, విద్యాశాఖ, జిల్లా అధికారులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

‘వచ్చారు జగన్‌.. మెచ్చారు జనం’

‘చంద్రబాబు చేతకాని చరిత్రహీనుడు’

అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా

పేద పిల్లల చదువుకు వెలుగు.. అమ్మఒడి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top