‘చంద్రబాబు చేతకాని చరిత్రహీనుడు’

Amma Vodi Scheme Launch: RK Roja Commets - Sakshi

సాక్షి, చిత్తూరు: జగనన్న అమ్మఒడి పథకం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని ఏపీఐఐసీ చైర్మన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పేదల పిల్లల చదువు కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. గురువారం అమ్మఒడి పథకం ప్రారంభోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘జగనన్న అమ్మ ఒడి’ విప్లవాత్మక పథకమని ప్రశంసించారు. ప్రతి బిడ్డ చదువుకుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పారు. పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్‌ ఈరోజు అమ్మ ఒడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇక నుంచి అ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌ అంటారని అభిలషించారు. చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

గత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. పేదపిల్లల చదువు కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన చరిత్రకారుడు వైఎస్‌ జగన్‌ అయితే.. పేదల చదువును కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలకు బలిచేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే.. పేదలు చదివే 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేసిన చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

మధ్యాహ్న భోజనంలో పేదలకు పౌష్టికాహారం అందించిన చరిత్రకారుడు జగన్‌ అయితే.. ఆ పేదపిల్లలు తినే కోడిగుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని విమర్శించారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్న చరిత్రకారుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే.. తను చదివిన పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేని చేతకాని చరిత్రహీనుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా ఇచ్చిన చరిత్రకారారుడు జగన్‌ అయితే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.35 వేలకు కుదించిన చరిత్రహీనుడు చంద్రబాబు అన్నారు.

సంబంధిత వార్తలు

అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా

వలస బతుక్కి ఊతం..

పేద పిల్లల చదువుకు వెలుగు.. అమ్మఒడి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top