ఆంధ్ర ప్రదేశ్లో ఇరు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టిందని తెలుగుదేశం పార్టీ నేత సిఎం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్లో ఇరు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టిందని తెలుగుదేశం పార్టీ నేత సిఎం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు రాజ్యసభలో తెలంగాణపై చర్చ జరిగే సమయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆందోళనకు కారణం కాంగ్రెస్ పార్టీయేనన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి, విదర్భను వదిలివేశారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకే తెలంగాణ సమస్య లేవనెత్తారన్నారు.
తాము హైదరాబాద్లోనే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పారు. తమని ఆంధ్ర వెళ్లిపొమ్మంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి ఎక్కడో పుట్టి ఇక్కడ రాజకీయాలు చేస్తుంటే, తాము హైదరాబాద్లో రాజకీయాలు చేయకూడదా? అని రమేష్ ప్రశ్నించారు. ఆ తరువాత మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉప సభాపతి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు.