బద్వేల్ డివిజన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెలాఖరులో ఇందుకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
రాజంపేట, న్యూస్లైన్: బద్వేల్ డివిజన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈనెలాఖరులో ఇందుకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది వరకే బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలించింది. బద్వేలు డివిజన్ ఏర్పాటు విషయంలో జిల్లా కలెక్టర్ ఇప్పటికే సానుకూలంగా నివేదిక పంపినట్లు తెలుస్తోంది.
ఆ నివేదిక ఆధారంగా బద్వేలు డివిజన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరులో డివిజన్ ఏర్పాటుపై గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సీజన్ ముంచుకొస్తోంది. ఈరెండు అంశాలు బద్వేలు డివిజన్ ఏర్పాటు అంశంపై ప్రభావం చూపనున్నాయి.
నిధుల వ్యయంతోనే వెనకడుగు..
కొత్త డివిజన్ల ఏర్పాటుకు నిధులను అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి కలుగుతుంది. బడ్జెట్ లోటుతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం కొత్త డివిజన్ల ఏర్పాటుపై ఆచితూచి అడుగులువేయనున్నది. కడప, రాజంపేట, జమ్మలమడుగు డివిజన్ల పరిధిలో జిల్లాలోని మండలాలు విస్తరించివున్నాయి. ఆర్డీఓలతో పాటు రాజంపేట సబ్కలెక్టర్కు విధి నిర్వహణ భారంగా మారుతోంది. డివిజన్ కేంద్రం నుంచి సుదూరంగా ఉన్న మండలాలు అనేకం ఉన్నాయి. పరిపాలన పరంగా విధి నిర్వహణ విషయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసివస్తోంది.
ప్రజల సౌకర్యార్థం ..పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం రెవిన్యూ డివిజన్ల సరిహద్దులను మార్చేందుకు యోచిస్తోంది. . జిల్లాలో మొత్తం 51 మండలాలు ఉన్నాయి. రాజంపేట రెవిన్యూ డివిజన్లో 17 మండలాలు, జమ్మలమడుగు డివిజన్లో 16 మండలాలు, కడప డివిజన్లో 17 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్లలోని సగానికిలోపు మండలాల వాసులు సమస్యలు విన్నవించుకునేందుకు రావాలన్నా, ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు అధికారులు వెళ్లాలన్నా తీవ్ర వ్యయప్రయాసాలను ఎదుర్కొంటున్నారు.
45కిలోమీటర్ల దూరమే లక్ష్యంగా..
ప్రస్తుతం ఉన్న రెవిన్యూ డివిజన్2 కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువగా ఉన్న మండలాలను నూతనంగా ఏర్పాటుచేసే కొత్త డివిజన్లలోకి కలుపుతారు. ఆయా మండలాల్లో నీటి వనరుల లభ్యత, అటవీ ప్రాంతాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కొత్త డివిజన్లు ఏర్పాటుచేస్తారు. రాజంపేట, రైల్వేకోడూరు కలిపి రాజంపేట డివిజన్గాను, బద్వేలు, మైదుకూరు కలిపి బద్వేలు డివిజన్గాను, జమ్మలడుగు, ప్రొద్దుటూరు కలిపి జమ్మలమడుగు డివిజన్గాను, రాయచోటి, పులివెందుల కలిపి పులివెందుల డివిజన్గా, కడప, కమలాపురం కలిపి కడప రెవిన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.