ప్రజాప్రతినిధులను కాదని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలపై కోర్టులో తేల్చుకుంటామని
పాలకొండ: ప్రజాప్రతినిధులను కాదని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలపై కోర్టులో తేల్చుకుంటామని వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం పాలకొండలో సీనియర్ నాయకుడు పాలవస రాజశేఖరం నివాస గృహంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీలు చేపడుతున్న అన్యాయాలను ఆయనకు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇప్పటికే ఈ కమిటీలపై కోర్టులో పిల్ దాఖలు చేశామన్నారు. ఈ కేసు విచారణలో ఉందని, త్వరలోనే న్యాయం జరుగుతుందని వివరించారు.
గ్రామాల్లో అర్హులకు అన్యాయం జరిగితే సంబంధిత వివరాలతో తమకు తెలియజేయాలని చెప్పారు. అటువంటి వాటిని కోర్టు దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రతి గ్రామంలోనూ సంక్షేమ పథకాలు అందించడంలో వివక్షత కొనసాగుతోందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. ప్రతి పథకానికి జన్మభూమి కమిటీలకు పెత్తనం అందిండంతో రాజకీయూలు చేస్తూ పేదలకు పథకాలు దక్కకుండా చేస్తున్నారని వివరించారు. ఈ సమస్యలపై పోరాటం సాగిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేయాలని, ప్రజలకు మేలు జరిగేలా పోరాటాలు సాగించాలని తెలిపారు.