బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం | BJP can not be developed | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Aug 29 2013 2:33 AM | Updated on Mar 29 2019 9:18 PM

దేశాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని, తొమ్మిదేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు

ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : దేశాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని, తొమ్మిదేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో దేశం అభివృద్ధి పథంలో పయనించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో జరిగిన జెండావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల్లోని సుమారు రెండు వందల మంది ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గంగారెడ్డి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టకుండా ఇరు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పిందన్నారు. బిల్లుకు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ఎన్నో ఏళ్లుగా తెలియజేస్తున్నామన్నారు.
 
 ప్రజలకు, రైతులకు అందించాల్సిన రాయితీలను అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వంపై వారు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తును అందజేస్తామని హామీలిచ్చి ప్రస్తుతం విద్యుత్తు కోతలతో వారిని ఇబ్బందులను గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం పూర్తిగా స్కాంలు, అవినీతిమయంగా మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనలో దేశాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి నాయకులు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పేరుతో మరోమారు రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేసే విధంగా ప్రకటనలు ఇస్తుందన్నారు. ఇన్నాళ్లు తెలంగాణ ప్రాంతంలో చిచ్చు రగిల్చిన యూపీఏ ప్రభుత్వం ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో చిచ్చు పెట్టిందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement