'టీడీపీకి ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయం'
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవి బానిస రాజకీయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవరాజకీయాలకు మారు పేరు చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, వారితో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నోసార్లు చెప్పామని స్పష్టం చేశారు.
మీలా హోదా కోసం పూటకో మాట మార్చలేదని భూమన నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేని చంద్రబాబు, ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో చంద్రబాబు అంత దుర్మార్గమైన, అవకాశవాద రాజకీయ నాయకుడు మరొకరులేరన్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా దోచుకున్న డబ్బును తెలంగాణ ఎన్నికల్లో మంచినీళ్లలా పారించారని, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో కూడా రానున్న ఎన్నికల్లో ఓటుకు మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజలు తమ ఓటుతో టీడీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమన్నారు.