తమకు కనీస వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన ....
కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులు నాయకుల అరెస్ట్
మచిలీపట్నం (చిలకలపూడి) : తమకు కనీస వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన ఆశావర్కర్లు కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది ఆశావర్కర్లు, సీఐటీయూ నాయకులు బారికేడ్లు ఎక్కి లోపలికి వెళ్లగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిలకలపూడి పోలీస్స్టేషన్కు తరలించారు. నాయకులను విడుదల చేయాలంటూ పోలీస్స్టేషన్ ఎదుట వర్కర్లు ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులను విడుదల చేయడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఆందోళన సందర్భంగా సీఐటీయూ గౌరవాధ్యక్షుడు ఎన్సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అనేక విధులను అప్పగించి వెట్టిచాకిరీ చేయిం చుకుంటున్నారన్నారు. వారికిస్తున్న చాలీ చాలని గౌరవవేతనాన్ని కూడా మూడు నెలలుగా చెల్లించడం లేదన్నారు. కనీస వేతనం లేక అర్ధాకలితో ఆశావర్కర్లు అలమటిస్తున్నారని చెప్పారు.
అసెంబ్లీని ముట్టడిస్తాం...
సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే రాబోయే సమావేశాల్లో అసెం బ్లీని ముట్టడిస్తామని ఆశావర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల అన్నారు. కనీస వేతనం నిర్ణయిం చాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా ఆశావర్కర్లకు యూనిఫాంలు ఇవ్వడం లేదన్నారు. సీఐటీయూ నాయకులు చౌటపల్లి రవి, దివి సీఐటీయూ నాయకులు శీలం నారాయణరావు, కె.శ్రీనివాసరావు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశావర్కర్లు పాల్గొన్నారు.