Sakshi News home page

అయ్యో.. ఎంత కష్టం..

Published Mon, May 4 2015 4:07 AM

అయ్యో.. ఎంత కష్టం..

కూటి కోసం సౌదీకి వెళితే..చిత్ర హింసలకు గురి చేశారు
ఉపాధి చూపించని ఏజెంట్
ఇండియన్ ఎంబసీలో రోదిస్తున్న మహిళ


వారిది కడు పేదరికం.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో డబ్బు సంపాదించేందుకు ఆమె సౌదీకి వెళ్లాలని భావించింది. ఎట్టకేలకు ఒక ఏజెంట్‌తో ఒప్పందం కుదుర్చుకొని సౌదీ అరేబియాకు వెళ్లింది. అక్కడ ఆమెకు పని చూపలేదు. ఆమె ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో.. దిక్కుతోచని స్థితిలో సౌదీ వీధుల్లోకి వచ్చింది. అక్కడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఇండియన్ ఎంబసీకి తరలించారు. తనను విముక్తి చేయండంటూ ఆమె అక్కడి అధికారులను ప్రాధేయపడుతోంది.
 
ప్రొద్దుటూరు క్రైం :  ప్రొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న దుర్గం పుల్లయ్య పాత చీరెల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. అతని భార్య పర్వీన్ ఇటుకల ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్లేది. వారికి మాబుచాన్, చాందిని అనే కుమార్తెలు, రహీం అనే కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరు కష్టపడుతున్నప్పటికీ అంతంత మాత్రమే డబ్బు వస్తోంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కారణంగా వారి పోషణ నిమిత్తం కొంత డబ్బు సంపాదించాలని ఆమె నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సౌదీకి వెళ్తానని భర్తతో చెప్పగా అతను సరేనని ఒప్పుకున్నాడు.

సౌదీకి వెళ్లేందుకు ఏజెంటుతో ఒప్పందం
 మైదుకూరు రోడ్డులోని ఆరవేటి థియేటర్ సమీపంలో ఉంటున్న ఓ ఏజెంటుతో ఆమె మాట్లాడుకుంది. సౌదీలోని సేఠ్ ఇంటిలో పని చేయడానికి పర్వీన్‌ను పంపిస్తానని అతను చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమె తన వద్ద ఉన్న కొంత డబ్బు ఇవ్వగా మిగిలిన డబ్బు ఏజెంటే భరించి గత నెల 26న పర్వీన్‌ను సౌదీకి పంపించాడు. మిగిలిన డబ్బు సౌదీలో జీతం వచ్చిన వెంటనే తనకు ఇవ్వాలని ఏజెంటు ఆమెతో అన్నాడు. సౌదీకి పంపించిన అతను అక్కడున్న తన మరో ఏజెంటుకు ఆమెను అప్పగించాడు.

అయితే అతను పర్వీన్‌ను ఇంటిలో పనికి కాకుండా ఓ గోడౌన్‌లో వదిలాడు. అక్కడున్న వారు ఆమెను కొరడాలతో కొడుతూ చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో ఆమెను తనను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని అడిగే సాహసం చేయలేక రెండు వారాల తర్వాత ఆమె వారికి చెప్పకుండా సౌదీ వీధుల్లోకి వచ్చింది. అయితే ఆమె వద్ద పాస్‌పోర్టు, వీసా లేకపోవడంతో అనుమతి లేకుండా సౌదీలో తిరుగుతోందన్న కారణంగా అక్కడి పోలీసులు అరెస్టు చేసి ఆమెను ఎంబసీకి తరలించారు.

నన్ను కాపాడుకోండి
 ఎంబసీలో ఉన్న మరో మహిళ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పర్వీన్ రెండు రోజుల క్రితం తన సోదరుడు షాహుసేన్‌కు ఫోన్ చేసింది. పని చూపిస్తానని తీసుకెళ్లిన ఏజెంటు పనిలో వదలకుండా చిత్రహింసలకు గురిచేశాడని ఆమె రోదిస్తూ ఫోన్‌లో చెప్పింది. ఆమె మాటలు విన్న పిల్లలు బోరున విలపించారు. ఎలాగైనా తనను ఇండియాకు పిలిపించుకోవాలని ఆమె తన సోదరున్ని వేడుకుంది.

ఈ విషయంపై షాహుసేన్ ఏజెంటును ప్రశ్నించగా తనకు రూ.లక్షన్నర దాకా ఖర్చయిందని, ఆ డబ్బు ఇస్తే కానీ పర్వీన్‌ను ఇండియాకు తీసుకుని వచ్చేది ఉండదని చెప్పాడు. కావాలంటే ఇప్పుడు టికెట్ డబ్బులు ఇస్తాం ఆమెను ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు బతిమాలినా అతను వినిపించుకోలేదు. ఏజెంటు బెదిరించడంతో పర్వీన్ భర్త దుర్గం పుల్లయ్య కూడా గత కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయాడని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

దీంతో షాహుసేన్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా వారి పిల్లలు ముగ్గురు ఆమె జేజి దస్తగిరమ్మ వద్ద ఉంటున్నారు. అమ్మ కావాలి అంటూ ఆ పిల్లలు ఏడుస్తుంటే వారికి ఏం జవాబు చెప్పాలో దిక్కుతోచక ఆమె క న్నీళ్లు దిగమింగుకుంటోంది. పోలీసులు స్పందించి ఆమెను సౌదీ నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement