హెల్మెట్ ధరించని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. తొలి రోజే 434 కేసులు నమోదు చేశారు.
విజయనగరం క్రైం:హెల్మెట్ ధరించని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. తొలి రోజే 434 కేసులు నమోదు చేశారు. ఆగస్టు 1 నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో శనివారం ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు ఎస్.అమ్మినాయుడు, ఎ.నరేష్, రవీంద్రరాజులు హెల్మెట్ ధరించని వాహనదారులపై కేసులు నమోదుచేశారు.
ఎత్తుబ్రిడ్జి సమీపంలో ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, ఎస్.ఐ ఎస్.అమ్మినాయుడు వేర్వేరుగా, ఐస్ప్యాక్టరీ జంక్షన్ వద్ద ఎ.నరేష్, పూల్బాగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో రవీంద్రరాజు కేసులు నమోదు చేశారు. నిబంధన పాటించనివారి 412 మంది నుంచి రూ.41,500 అపరాధ రుసుం వసూలు చేశారు. సాయంత్రం ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. కాగా వన్టౌన్ పోలీసులు హెల్మెట్ ధరించని 22 ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రోజూ ఇదేవిధంగా కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు తెలిపారు.