ఆంధ్రప్రదేశ్లో మొత్తం 32 మైనింగ్ లీజులను రద్దు చేశారు.
32 లీజుల రద్దు.. ఎక్కువ వైఎస్ఆర్ జిల్లాలోనివే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మైనింగ్ లీజులను రద్దు చేసింది. మొత్తం 32 గనుల లీజులను రద్దు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 371 ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలు స్తంభించిపోతాయి. వీటిలో 14 లీజులు వైఎస్ఆర్ జిల్లాలోనివే. కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు లీజులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. 2002 నుంచి సిలికా, బెరైటీస్, లేటరైట్, డోలమైట్, సున్నపురాయి, గ్రానైట్ వంటి ఖనిజ సంపద వెలికి తీసేందుకు అప్పట్లో ప్రభుత్వాలు భూములు లీజుకిచ్చాయి.
వీటిలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన, రిటర్న్లు సమర్పించని, కార్యకలాపాలు ప్రారంభిం చని వ్యక్తులు, సంస్థల లీజులను ప్రభుత్వం రద్దు చేసినట్లు అధికారవర్గాలు తెలి పాయి. కొన్ని కంపెనీలు పర్యావరణ శాఖ అనుమతి తీసుకోలేకపోవడం వల్ల వాటి లీజులు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మరికొన్ని సంస్థలు లీజు పొందిన పరిధిని మించి తవ్వకాలు జరిపాయని, ఇది నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొంది. వీటికి ఆ సంస్థలు తెలిపిన కారణాలు సహేతుకంగా లేవని ఆ జీవోల్లో స్పష్టం చేసింది.