తునిలో కాపు ఐక్య గర్జన సంద ర్భంగా జరిగిన పరిణామాలపై బాధ్యుల ని భావిస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సీబీ సీఐడీ పోలీసులు
అమలాపురం టౌన్ : తునిలో కాపు ఐక్య గర్జన సంద ర్భంగా జరిగిన పరిణామాలపై బాధ్యుల ని భావిస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సీబీ సీఐడీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్న కోనసీమలో ముఖ్యంగా అమలాపురంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి అమలాపురానికి మూడు ఏఎన్ఎస్ పార్టీలు, ఇతర బలగాలు వచ్చాయి. పట్టణంలో కాపులు ఎక్కువ గా నివసించే ప్రాంతాల్లో 14 చోట్ల పోలీ సు పికెట్లను ఏర్పాటు చేశారు. కోనసీమ వ్యాప్తంగా కాపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కాపు నాయకులు, కార్యకర్తలు, యువకుల్లో సీబీసీఐడీ కదలికలతో ఆందోళనకు గురయ్యారు.
జిల్లా ఏఎస్పీ దామోదర్ను అమలాపురం డివిజన్కు ప్రత్యేక అధికారిగా నియమించటంతో ఆయన సోమవారం రాత్రే అమలాపురం వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలో కాపులు అధికంగా నివసించే కొంకాపల్లి, కల్వకొలను వీధి, మహిపాల వీధి, నల్లా వీధి, గారపాటి వీధి తదితర వీధుల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. రహస్య సీసీ కెమెరాలు కూడా అమర్చారు. పోలీసు అధికారులు ట్యాబ్లతో ప్రతి కదలికను ఫోటోలు తీస్తున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కోనసీమపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.