కనుమరుగు | India stops telegram service after 162 years | Sakshi
Sakshi News home page

Jul 14 2013 9:51 PM | Updated on Mar 21 2024 9:14 AM

‘ఒకప్పుడు టెలిగ్రాం ఎన్నో విషాద వార్తలను మోసుకొచ్చింది. ఇప్పుడు తన మరణవార్తను తానే మోసుకుపోతోంది’ అని 75 ఏళ్ల గుల్షన్ రాయ్ అన్నారు. దాదాపు 40 ఏళ్లపాటు టెలిగ్రాఫిస్ట్‌గా పనిచేసిన ఆయన 1997లో రిటైైరయ్యారు. టెలిగ్రామ్స్ సువర్ణయుగంలో పనిచేసిన ఆయన ఈ సేవలకు తెర పడుతున్న నేపథ్యంలో ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో.. ఎమర్జెన్సీ రోజుల్లోనూ పనిచేశా. యుద్ధ సమయంలో ఆహారం, నిద్ర గురించి పట్టించుకోకుండా 24 గంటలూ పనిచేశాం. యుద్ధంలో క్షతగాత్రులైన వారు, మరణించిన వారి వివరాలు సైనిక ప్రధాన కార్యాలయం నుంచి వచ్చేవి. వాటిని మేం పంపేవాళ్లం. ఒక్కసారిగా అలాంటి వేలాది వార్తలను పంపడం ఎంతో బాధ కలిగించేది’ అని తెలిపారు. అప్పట్లో టెలిగ్రాఫిస్ట్ ఉద్యోగాలకు చురుగ్గా వ్యవహరించేవారినే తీసుకునేవారు. మెట్రిక్ ఫస్ట్‌క్లాస్‌లో పాసైతేనే అర్హులు. రాత పరీక్షతోపాటు దస్తూరీ పరీక్షను నిర్వహించేవారు. ‘అప్పట్లో మోర్స్ కోడ్ యంత్రం చేసే డాట్, డాష్‌ల ధ్వనిని టెలిగ్రాఫిస్టులు ఎంతో ఎంజాయ్ చేసేవాళ్లు. వాళ్లకది సంగీతంతో సమానం’ అని ఢిల్లీ టెలిగ్రాఫ్ ఆఫీసులో పనిచేస్తున్న గజేంద్ర నేగీ చెప్పారు. అటు టెలిగ్రాం సేవల్లోనూ చాలా మార్పులొచ్చాయి. తొలితరంలో మోర్స్ కోడ్.. తర్వాత టెలిప్రింటర్లు అనంతరం ఇంటర్నెట్ ఆధారిత సేవ లు వచ్చాయి. మోర్స్ కోడ్ యంత్రం నుంచి వచ్చే ధ్వని ఆధారంగా అది ఏ అక్షరమో తాను చెప్పగలనని గుల్షన్ రాయ్ తెలిపారు. నాటి టెలిగ్రాంలు నేటి తరం ఎస్‌ఎంఎస్‌లన్నారు. టెలిగ్రాఫ్ సేవలు నిలిపివేయడంపై ఢిల్లీ జన్‌పథ్‌లోని టెలిగ్రాఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో టెలిగ్రాఫ్ సేవలు అత్యవసరమన్నారు. ‘మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు టెలికాం కంపెనీల సేవలు అందుబాటులో లేవు. అక్కడ టెలిగ్రాఫ్ సేవలు అత్యవసరం. సరిహద్దుల్లో పనిచేస్తున్న జవాన్లు సెలవులకు దరఖాస్తు పెట్టుకోవడానికి తదితరాలకు టెలిగ్రాం సేవలనే వాడతారు. కోర్టులు కూడా టెలిగ్రాం లను సర్టిఫైడ్ కాపీలుగా పరిగణిస్తాయి. ఇంత ఉదాత్తమైన సేవలను ఎందుకు నిలిపివేస్తున్నారు’ అని ఎంఎస్ ఆర్య అనే వినియోగదారుడు ప్రశ్నించారు.

Advertisement

పోల్

Advertisement