కడప అగ్రికల్చర్: రైతన్న కష్టం నేలపాలైంది.. చేతికొచ్చిన పంట చూస్తుండగానే ఈదురుగాలులకు నేలమట్టమైంది. కర్షకుడి ఏడాది కష్టంపై అకాల వర్షం నీళ్లు చల్లింది. శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలో వీచిన భారీ గాలులు, అకాల వర్షాలతో ఉద్యాన పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా మామిడి, అరటి, బొప్పాయి, నారింజ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతలకు రూ. 179.35 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశారు.
జిల్లాలో వేలాది ఎకరాల్లో..
జిల్లాలో వీచిన ఈదురు గాలులు, అకాల వర్షాలకు లింగాల, పులివెందుల, చక్రాయపేట, దువ్వూరు, రాజంపేట మండలాల్లో 484 హెక్టార్లలో అరటి, 9 హెక్టార్లలో బొప్పాయి, 12 హెక్టార్లలో మామిడి, 10 హెక్టార్లలో నారింజ (స్వీట్ ఆరంజ్) ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఉద్యాన అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
పులివెందుల: ఈదురు గాలులకు జిల్లాలో అరటి, మామిడి పంట లు దెబ్బతిన్నాయని.. ఉద్యాన రైతులను ఆదుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు జరిగిన నష్టంపై కలెక్టర్ శ్రీధర్కు తెలియజేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున వెంటనే నష్టపరిహా రం అందించాలన్నారు. త్వరితగతిన పంట నష్టం తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పంట నష్టం అంచనాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేశామని ఎంపీకి వివరించారు.
పులివెందుల: నల్లపరెడ్డిపల్లెలో నేలకూలిన అరటి
అకాలవర్షాలు, ఈదురుగాలులకునేలకొరిగిన ఉద్యాన పంటలు
అరటి, మామిడి, బొప్పాయి,నారింజ పంటలకు తీవ్ర నష్టం
490 మంది రైతులకు 515 హెక్టార్లలో పంటనష్టం
ప్రాథమిక నష్టాన్ని అంచనా వేసిన ఉద్యానశాఖ


