కడప కోటిరెడ్డి సర్కిల్ : ఏపీ ఆర్టీసీ కడప రీజియన్ జిల్లా ప్రజా రవాణా అధికారిగా పలినేని రమేష్ బాబు శుక్రవారం సాయంత్రం ఆర్ఎం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనంతపురం డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా పని చేస్తూ బదిలీపై కడపకు వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న ఆర్ఎం పోలిమేర గోపాల్రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రమేష్బాబును నియమించారు. ఈయన మొదట 1992లో ఆర్టీసీలో ఉద్యోగ ప్రస్థానం చేసి గద్వాల, తాడిపత్రి, పొదిలి, బద్వేలు, ఒంగోలు పీఓ, రాపూరు, తిరుపతి బస్స్టేషన్లలో ఏపీఎంగా, ఏడబ్లూఎంగా కరీంనగర్, జగ్గయ్యపేట, 2008లో జగ్గయ్యపేట డీఎంగా పని చేస్తూ 2008లో పదోన్నతిపై విజయనగరం ప్రిన్సిపల్గా పని చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంఈగా మెదక్, గ్రేట్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, కర్నూలు డిప్యూటీ సీఎంఈగా, 2018లో కడపలో డిప్యూటీ సీపీఎంగా పని చేశారు. ప్రస్తుతం ఆయన అనంతపురం, సత్యసాయి జిల్లాల డిప్యూటీ సీఎంఈగా పని చేస్తూ బదిలీపై జిల్లా ప్రజా రవాణాధికారిగా కడపకు వచ్చారు. ఈ క్రమంలో కడప డిప్యూటీ సీఎంఈ దిల్లీశ్వరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. సీఓఎస్ హరి, జోనల్ వర్క్షాపు మేనేజర్ గిరిధర్రెడ్డి, పీఓ ధనలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ రవి, కడప డీఎం నిరంజన్రెడ్డి, కడప డీఎం ఆర్సీ నిరంజన్, సిబ్బంది రోజాకుమారి, బాబు, కమాల్, వెంకటేశ్వర్లు, మధుసూదనరావు, శివ, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన యూనివర్సిటీలో లలిత కళల విభాగం వారు ఏర్పాటు చేసిన ‘ది గోల్డెన్ త్రిషోల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ను వైస్ చాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ శుక్రవారం ప్రారంభించారు. అలాగే విద్యార్థులు చిత్రించిన ‘ఆర్ట్ కేటలాగ్’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర కళా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలిపారు. పెద్ద పెద్ద కోర్సులు చేసిన వారు అతి తక్కువ వేతనాలకు పని చేస్తుంటే.. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేతనాలు పొందుతుండడం విశ్వవిద్యాలయం వారికి ఇచ్చిన నైపుణ్యానికి నిదర్శనం అన్నారు. ఫైన్ ఆర్ట్స్ శాఖ విభాగాధిపతి డాక్టర్ కోటా మృత్యుంజయరావు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ 10 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. చిత్ర ప్రదర్శన చేసిన 2022 –26వ బ్యాచ్ విద్యార్థులు ఎం.విజయ్ కుమార్, ఆర్.పునీత్, డి.రమ్య జ్యోతి, వై.రెడ్డి ప్రియదర్శిని, వై.అరవింద్, బి.దేవదాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.పద్మ, డీన్ ప్రొఫెసర్ ఎ.జి.దాము, ఆచార్య నజీర్ అహ్మద్, అధ్యాపకులు వెంకటేష్, చినరాయుడు, ఈరప్ప, చంటి సూరి, ఎం.వాసవి పాల్గొన్నారు.


