కడప సెవెన్రోడ్స్: దివ్యాంగుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, పునరావాస సేవలతో పాటు సాధికారత కోసం ప్రభుత్వం పాటుపడుతోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వ్యాప్తంగా 70 మంది దివ్యాంగులకు మంజూరైన ఉచిత మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్తోపాటు రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 నుంచి 45 ఏళ్లలోపు కలిగి, కనీసం 70 శాతం దివ్యాంగత ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ ఉచిత మోటరైజ్డ్ వాహనాల పంపిణీ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్కూటర్ల పంపిణీలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, డిసేబుల్ శాఖ ఏడీ కృష్ణ కిషోర్, సంక్షేమ అనుబంధ శాఖల అధికారులు, అనుబంధ శాఖల అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


