మదనపల్లె సిటీ: మదనపల్లె మండలం సీటీఎంలో వెలసిన శ్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరథోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మి నరసింహస్వామి గోవిందా... ప్రహ్లాద వరద గోవిందా.. జయ జయ సింహా ..జయ నరసింహా అంటూ భక్తులు కీర్తించగా గోవింద నామస్మరణతో సీటీఎం పురవీధులు మార్మోగాయి. బ్రహ్మరథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే రథాన్ని నడిపి శ్రీవారు పురవీధుల్లో విహరించేందుకు సహరించి భక్తులంతా స్వామిని దర్శించుకునేలా చూస్తారని భక్తుల నమ్మకం. ఆలయంలో ఉదయం అర్చక బృందం రుషికేశవ్, మంజువిక్రమ్, ఆదిత్యచార్యులు, రామాచార్యులు తేరు ముందు అస్థాన పూజలు నిర్వహించారు. స్థానిక ప్రముఖులు రథం వద్ద జరిగిన తొలి పూజల్లో పాల్గొని తర్వాత రథంపై శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు. ఒకవైపు ఎండలు మండుతున్నా భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని రథంపైకి మిరియాలు, దవనం చల్లేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. ధార్మిక సేవా ఆధ్వర్యంలో ధూళోత్సవం నిర్వహించారు.
వైభవంగా లక్ష్మినారసింహుడి
బ్రహ్మరథోత్సవం


