కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని, వెంటనే వారి రక్షణ కోసం చట్టం తీసుకురావాలని ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు మోపూరి బాలక్రిష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్ను శ్రీనివాసులు, ఏపీయూడబ్లూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సురేంద్ర శివతోపాటు ఎలక్ట్రానిక్స్ మీడియా రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టడానికి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
మార్చురీలో
గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఈ నెల 27న గుర్తు తెలియని యువకుడు(24)ని వైద్యం కోసం తీసుకుని వచ్చారు. అతన్ని తీసుకుని రాగానే పరీక్షలు జరిపి మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు.
1న టీటీసీ శిక్షణకు
హాజరు కావాలి
కడప ఎడ్యుకేషన్ : టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్(టీటీసీ) శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు మే 1వ తేదీ ఉదయం 9 గంటలకు కడప ఐటీఐ సర్కిల్ వద్ద ఉన్న జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో హాజరు కావాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తుతోపాటు పదో తరగతి పాస్ సర్టిఫికెట్ ఒరిజినల్, ఒక జిరాక్స్ కాపీ, సంబంధిత టెక్నికల్ ట్రేడ్లో పాస్ అయిన డిప్లొమా సర్టిఫికెట్ ఒరిజినల్తోపాటు జిరాక్స్ కాపీలను తీసుకుని రావాలని పేర్కొన్నారు. టీటీసీ అనేది డ్రాయింగ్, టేలరింగ్, మ్యూజిక్ వంటి సాంకేతిక అంశాలను బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా అందించే 42 రోజుల వేసవి శిక్షణ కోర్సు అని తెలిపారు. ఇది డ్రాయింగ్, క్రాఫ్ట్, ఇతర నైపుణ్య ఆధారిత రంగాలలో టీచర్గా పని చేయడానికి అవసరమైన ధృవీకరణను అందిస్తుందని వివరించారు.


