వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మంగళవారం పీయూసీ–1, ఇంజినీరింగ్–1, 2 విద్యార్థులకు సెమిస్టర్– 2 పరీక్షలు ముగియడంతో జూన్ 5 వరకు సెలవులు ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ సిబ్బంది అవుట్ పాస్ కోసం ఏర్పాటు చేసిన యాప్ పని చేయకపోవడంతో అవుట్ పాస్ ఇచ్చేందుకు కొంచెం ఆలస్యమైంది. దీంతో సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగింది. మధ్యాహ్నం గంటపాటు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో రగడ చోటుచేసుకుంది. అవుట్ పాసులు ఇవ్వకుండా ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులతో గొడవకు దిగారు. విద్యార్థులకు అవుట్ పాస్ ఇవ్వడంలో ట్రిపుల్ ఐటీ సిబ్బంది విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. మాన్యువల్ పేరుతో అవుట్ పాస్ ఇవ్వడంలో సిబ్బంది ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా అవుట్ పాస్ జారీ చేసే సిబ్బంది ఇద్దరే ఉండడంతో జాప్యం జరుగుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు రిజర్వేషన్ చేసుకోవడంతో ఆందోళనలో పడ్డారు. ఇంత జరుగుతున్నా ట్రిపుల్ ఐటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. అంతేకాకుండా ట్రిపుల్ ఐటీ నుంచి వేంపల్లెకు రావాలంటే ఆటోలతో ఇబ్బంది పడుతున్నారు.
సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల
మధ్య గొడవ


