సెలవుల కాలం.. జర భద్రం!
కడప ఎడ్యుకేషన్: నిన్నామొన్నటి వరకు పిల్లలతో సందడిగా ఉన్న బడులన్నీ నేడు వేసవి సెవులతో నిశ్శబ్దమైపోయాయి. ఆ సందడంతా ఇంటి గడపలకు చేరింది. సెలవు రోజుల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు అజాగ్రత్తల వల్ల ప్రమాదాల బారిన పడుతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే పిల్లలపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వారికి చెరువులు, నదులు, కుంటలు,బావులపై అవగాహన కల్పించాలి. దీంతోపాటు వారికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చి అప్రమత్తం చేయాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఎంతైనా ఉంది.
నీరు.. కాకూడదు కన్నీరు..
ఓ వైపు ఎండలు మరోవైపు ఉక్కపోత.. ఇంకేముంది నీరు కనిపిస్తే చాలు పిల్లలకు ఎక్కడ లేని ఉల్లాసం ఉరకలేస్తుంది. ఆనందం పొంగుకొస్తుంది. ఈ ఉల్లాసంలో నీటి మడుగులు, బావులు, చెరువుల ఎంతలోతు ఉన్నాయో ఆలోచించరు. ఈత వచ్చిన వారితో పాటు ఈత రానివారు కూడా సరదాగా దిగి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. చివరకు తల్లిదండ్రులకు కడపకోత మిగుల్చుతున్నారు. అందుకే ఈత రాని వారు చెరువులు, కాలువలు వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.
స్నేహితులతో బయటికి పంపిస్తే..
పిల్లలను ఆడుకునేందుకు స్నేహితులతో బయటికి పంపిస్తే ఎవరితో వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఎండలకు బయట తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు వేసవి కాలం కావడంతో వేడికి తట్టుకోలేక విష పురుగులు బొరియల నుంచి బయట వచ్చి చల్లటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. పిల్లలు ఆటల్లో పడి ఆదమరిస్తే వాటి కాటుకు గురి కావాల్సి ఉంటుంది. సెలవులు ముగిసే వరకు పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
గాలి పటాలను ఎగుర వేసేటప్పుడు...
వేసవి సెలవులు కావడంతో పిల్లలు గాలిపటాలను ఎగురు వేసేటప్పు డు విద్యుత్తు తీగలతో జాగ్రత్తగా ఉండాలి. గాలిపటాలు విద్యుత్తు తీగల నడుమ ఇరుకొన్నప్పుడు వాటిని తొలగించేందుకు ఇనుపకడ్డీలు, పచ్చి కర్రలను వాడవద్దు. అలాగే క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలాడుకునే సమయంలో విద్యుత్తు నియంత్రికల వద్ద జాగ్రత్తగా ఉండాలి.
నదులు, చెరువులు, కాల్వలుప్రమాదాలకు నిలయాలు
పిల్లలు బయటకు వెళ్లినప్పుడుఓ కంట కనిపెట్టాలి
షికారుకు వెళ్లే పిల్లలకుతల్లిదండ్రులు సూచనలు చేయాలి
సమ్మర్ ట్రిప్ తీపి జ్ఞాపకాలుగా మిగలాలి


