రాజంపేట : నందలూరు మండలం టంగుటూరు పంచాయతీ గట్టుమీదపల్లెలో బెల్లంకొండయ్యను రాయితో హత్య చేసిన కేసులో చిన్నయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే తెలిపారు. శనివారం తన కార్యాలయంలో అరెస్టు చూపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య కేసులో నిందితుడిని రాజంపేట జేఎఫ్సీఎం కోర్టుకు హాజరుపరిచామన్నారు. రిమాండ్కు తరలించామన్నారు. ఏఎస్పీతో పాటు సీఐ వెంకటేశ్వర్లు, నందలూరు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, నందలూరు పోలీసులు పాల్గొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డున తిప్పలూరు గ్రామ సమీపాన సాయిబాబా గుడి వద్ద ఉన్న పెట్రోల్ బంకు ఆవరణలో బైక్ను లారీ ఢీకొన్న సంఘటనలో పెను ప్రమా దం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లారీ పెట్రోల్ బంకులోకి వెళ్తున్న సమయంలో బైక్ను ఢీకొంది. ద్విచక్ర వాహనం లారీ టైర్ల కింద పడి నుజ్జునుజ్జు అయింది. అయితే బైక్ నడిపే వ్యక్తి పక్కకు దూకడం వల్ల ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అక్కడ చూస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
రాణి కాలువలో
మృతదేహం వెలికితీత
జమ్మలమడుగు రూరల్ : రాణి కాలువలో పడి మృతి చెందిన మోరగుడి గ్రామానికి చెందిన కుండా చిన్న చౌడయ్య(65) మృతదేహన్ని శనివారం వెలికితీశారు. మోరగుడి గ్రామంలోని శ్రీరాములపేటలో ఉన్న రాణి కాలువలో శుక్రవారం మృతదేహం ప్రత్యక్షం కావడంతో వెలికి తీయడానికి పోలీసులు ప్రయత్నించారు. కాగా రాత్రి కావడంతో తీయడానికి వీలు పడలేదు. చిన్న చౌడయ్య 3 రోజుల క్రితం మద్యం మత్తులో కాలువలో పడి మృతి చెందినట్లు తెలుస్తోందని ఆయన కుమారుడు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ హైమావతి తెలిపారు.


