బ్రహ్మంగారిమఠం: జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం రాత్రి గజవాహనోత్సవం వైభవంగా సాగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి గజవాహనంపై ఆశీనులను చేశారు. మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అక్కడ చిన్నమఠం మఠాధిపతి శ్రీవీరశివకుమారస్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్ద మఠం చేరుకుంది. ఉత్సవానికి గుంటూరు జిల్లా బుద్దాంకు చెందిన కట్టోజు సత్యనారాయణచార్యులు,వరహాలమ్మ, విశ్వనాథాచారి, గురుస్వాములు, శివరూపాచారి ఉభయదాతలుగా వ్యవహరించారు.
ప్రత్యేక పూజలు: అంతకుముందు తెల్లవారుజామున ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టారు. ఈ ఉత్సవానికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మల్లయ్య, ధనలక్ష్మి, డాక్టర్ యక్కల సురేష్బాబు, స్వప్న ఉభయదారులుగా వ్యవహరించారు. సాయంత్రం భక్తుల కాలక్షేపం కోసం మైదుకూరుకు చెందిన యడవల్లి రమణయ్య భాగవతార్ ఆధ్వర్యంలో హరికథ ప్రదర్శించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం మేనేజర్ ఎన్.ఈశ్వరయ్య ఆచారి ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు.


