కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఆర్.రామచంద్రారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండలో డివి జనల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన స్వస్థలం ముద్దనూరు. ఈఓపీఆర్ అండ్ ఆర్డీగా తొండూరులో ఉద్యోగ ప్రవేశం చేసిన ఆయన 1997లో ఎంపీడీఓగా పదోన్నతి పొంది చాపాడు, ప్రొద్దుటూరు, రాజుపాలెం తదితర మండలాల్లో పనిచేశారు. డ్వామా ఏపీడీగా, రాజంపేట, జమ్మలమడుగులో విధులు నిర్వర్తించారు. అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
వైభవం.. ముక్తిరామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవం
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం ముక్తిరామలింగేశ్వరస్వామికి, రాజరాజేశ్వరి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. లోకకల్యాణార్థం గణపతి, నవగ్రహ, రుద్రహోమాలను నిర్వహించారు. సాయంత్రం గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తిరామలింగేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను రావణబ్రహ్మ వామనంపై కొలువుదీర్చి పుర వీధుల్లో శివనామస్మరణల మధ్య వైభవంగా ఊరేగించారు.
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. శని వారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మ దినం కావడంతో టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణో త్సవం నిర్వహించారు. కల్యాణమండపం వద్ద చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు.
పీఎం సూర్య ఘర్ ఉత్సవాలను జయప్రదం చేయాలి
కడప కార్పొరేషన్: ప్రధానమంత్రి సూర్యఘర్ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్.శ్రీనివాసులు అన్నారు. శనివారం విద్యుత్ భవన్లోని తన చాంబర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 5 నుంచి 14వ తేది వరకూ సూర్య ఘర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అమలు చేస్తున్న సౌర రూఫ్ టాప్లలో పురోగతి సాధించాలన్నారు. ఇప్పటికే కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు హరిసేవ్యా నాయక్, లక్ష్మీపతి, రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కమర్షియల్) వి.వి. మోహన్ కుమార్, మరియు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఏజెన్సీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


