● టీడీపీకి శృంగ భంగం...
సాక్షి ప్రతినిధి, కడప: కడప కార్పొరేషన్ పాలకమండలి మేయర్ అభ్యర్థిగా సీనియర్ కార్పొరేటర్ పాకా సురేష్ను వైఎస్సార్సీపీ ప్రకటించింది. కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కోసం ఆపార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి తుది నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికతో కార్పొరేటర్ల మధ్య చీలికలు కోసం యత్నించిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పలేదు. టీడీపీ ఎత్తులను పసిగట్టిన వైఎస్సార్సీపీ కార్పొరేషన్ పాలకమండలి చేజారకుండా జాగ్రత్తలు తీసుకుని సక్సెస్ అయ్యింది.
● కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో ఇరువురు కార్పొరేటర్లు బోలా పద్మావతి (22వ డివిజన్), ఆనంద్ (48వ డివిజన్) మృతి చెందారు. ఒకే ఒక్క కార్పొరేటర్ మాత్రమే జి ఉమాదేవి (49వ డివిజన్) తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 47 మందిలో 8 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 39 మంది కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే కార్పొరేటర్లు మధ్య అసంతృప్తులు తలెత్తితే కొందరినైనా తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఆనందించాలనే ఎత్తుగడలను టీడీపీ వేసింది. వారి అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు ఆశించారు. ఎలాగైనా పోటీ అనివార్యం అవుతోంది, ఒక వర్గమైన టీడీపీని ఆశ్రయం పొందుతుందని శతవిధాలుగా అధికార పార్టీ నేతలు ఆశించారు. టీడీపీ దురుద్ధేశ్యాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ, కార్పొరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజాద్బాషా, మాజీ మేయర్ కె సురేష్బాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బుధవారం సాయంత్రం సమాలోచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్లు అభిప్రాయాన్ని కోరి తుది నిర్ణయాన్ని ప్రకటించారు. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు.
వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏకాభిప్రాయం సాధించిన వైఎస్సార్సీపీ
కార్పొరేటర్ల మధ్య చీలికల కోసం టీడీపీ సన్నాహాలు
టీడీపీ నేతల ఎత్తులను చిత్తు చేసిన వైఎస్సార్సీపీ నేతలు
నేడు మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
కడప మేయర్గా ఉన్న సురేష్బాబును అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పదవీచ్యుతుడిని చేసింది. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దొంగ దెబ్బ తీశారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. కాగా, మేయర్ ఎన్నిక అనివార్యమైతే, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య చీలికలు వస్తాయి, తద్వారా లబ్ధిపొందాలని భావించిన టీడీపీ నేతలకు శృంగభంగం తప్పలేదు. అనేక డివిజన్లల్లో చెప్పుకునే నాయకుడు లేకపోవడంతో వైఎస్సార్సీపీలో చీలికలు ఆశించారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు మధ్య ఏకాభిప్రాయం కోసం ఆ పార్టీ నేతలు కసరత్తు చేసి సఫలీకృతులు కావడంతో మేయర్ ఎన్నిక గురువారం నాడు లాంఛనంగా పూర్తి కానుంది. బలం లేని కారణంగా మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇదివరకే ప్రకటించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పాకా సురేష్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
● టీడీపీకి శృంగ భంగం...


