ఒంటిమిట్ట రామాలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ఒంటిమిట్ట/తిరుపతి అన్నమయ్యసర్కిల్: పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. శుక్రవారం స్ధానిక పరిపాలనా భవనంలో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వచ్చే ఐదు దశాబ్దాల కాలంలో భక్తులు రోజుకు ఎంత మంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌళిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మికతను పెంపొందించేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామ స్వామి ప్రాశస్థ్యం నవతరానికి అందించేలా మ్యూజియమ్ సిధ్దం చేయాలన్నారు. ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవా నిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాం, నాలుగు మాడ వీధుల అభివృద్ధి, సిసి కెమెరాల ఏర్పాటు వంటి అంశాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆప్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో టిటిడి సీఈ టివి సత్యనారాయణ, ఎస్.ఈ–1 మనోహరం అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్


