
సచివాలయ ఉద్యోగుల బదిలీలలు
కడప కార్పొరేషన్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పురపాలక శాఖ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేసే అధికారం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే కమిషనర్కు కట్టబెడుతూ పురపాలకశాఖ ఆర్డీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లెక్కన కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జిల్లాలోని ప్రొద్దు టూరు, పులివెందుల, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం మున్సిపాలిటీల్లోని సుమారు 256 వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులందరికీ కడపలోనే కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు నిర్వహించనున్నారు.
● కడప కార్పొరేషన్లో ఇంతవరకూ ఉద్యోగుల మెరిట్ లిస్టుగానీ, ఖాళీలను గానీ చూపలేదు. కనీసం హెల్ప్డెస్క్ కూడా ఏర్పాటు చేయలేదు. ఈలోపే అత్యధికమంది సచివాలయ ఉద్యో గులు సిఫారసు లేఖల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరెవరిని ఏ వార్డులో వేయాలో, ఎవరిని బదిలీ చేయాలో తమ లెటర్ హెడ్లో జాబితాలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు తమ జాబితాను కమిషనర్కు పంపినట్లు ప్రచారం సాగుతోంది. కడపలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇదివరకే వార్డు సచివాలయ ఉద్యోగులను ఎక్కడికి పడితే అక్కడ బదిలీ చేశారు. ఈ సారి బదిలీల్లో కూడా ‘ఆమె జాబితా’కు ఆమోద ముద్ర తప్పదని తెలుస్తోంది.
టీడీపీ ఇన్చార్జులకు ఆయుధంలా...
అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నారు. అయినా టీడీపీ ఇన్చార్జులు తమ మాటే నెగ్గాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులను బెదిరించి, భయపెట్టి తమ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఈ బదిలీలను ఒక ఆయుధంలా వాడుకొని తమకు నచ్చిన వారిని, తాము ఏది చెబితే అది చేసేవారిని వార్డు సచివాలయాల్లో నియమించుకోవాలని ఎవరికి వారు పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో పారదర్శకంగా ...
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం చాలా పారదర్శకంగా మెరిట్ ప్రకారం పక్కాగా జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతే పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.
జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే కమిషనర్కు బదిలీ చేసే అధికారం
మెరిట్ లిస్టు ప్రకటించని అధికారులు
బదిలీలు ఎలా జరుగుతాయోనని ఉద్యోగుల్లో ఆందోళన
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల చుట్టూ ప్రదక్షిణలు