
షర్మిల సమావేశాన్ని శాంతియుతంగా అడ్డుకుంటాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని ఐఎంఏ హాల్లో 12న జరగబోయే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమావేశాన్ని శాంతియుతంగా గాంధేయమార్గంలో అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎ.సత్తార్, మాజీ డీసీసీ ఉపాధ్యక్షుడు నాసిర్ హుస్సేన్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ, పేర్కొన్నారు. నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో వారు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్.రాజశేఖర్రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఆ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనుకున్నామన్నారు. కానీ టీడీపీకి ఆమె కోవర్టుగా పనిచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దూరంగా ఉంటున్నారన్నారు. సీనియర్ నాయకులను దూరం చేస్తూ తనకు కావాల్సిన వారిని పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నజీర్అహ్మద్ను ఏఐసీసీ ఎన్నిక చేస్తే చివరి నిమిషంలో తెలంగాణకు చెందిన ఆర్థిక నేరగాడికి టికెట్ ఇచ్చారన్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎస్ఎ.సత్తార్, ఖాశీంఖాన్లకు ఇవ్వాలని బలపరిచినా కర్ణాటకకు చెందిన వ్యక్తికి కేటాయించి పార్టీకి నష్టం కలిగేలా చేశారన్నారు. షర్మిల నాయకత్వాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్రమ్, నాసిర్ఖాన్, కర్నాటి చంద్రశేఖర్రెడ్డి, అన్వర్, జాన్బాషా, రత్నకుమారి పాల్గొన్నారు.