
రాష్ట్రంలో రాజకీయ అరాచకపాలన
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజకీయ అరాచక పాలన సాగిస్తోందని, దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధాని నరేంద్రమోదీ తాకట్టు పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. రైల్వే కోడూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతీయులను చంపిన టెర్రరిస్టులను ఎంత మందిని హతమార్చారో ప్రధాని తెలపలేదన్నారు. దేశంలోని అటవీ సంపద కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేయడానికి మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేశారన్నారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమను వెంటనే నిర్మించాలన్నారు. అప్పట్లో సీఎం రమేష్ ఈ ప్లాంట్ కోసం నిరాహారదీక్ష చేసినా, ఇప్పటికీ శంకుస్థాపన రాళ్లు వెక్కిరిస్తున్నాయని పేర్కొన్నారు. జూన్ 2న అన్ని మండల కేంద్రాలలో ఆందోళన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, పండుగోల మణి, దార్ల రాజశేఖర్, చైతన్య, గంగాధర్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య