
వర్షాలు కురుస్తున్నాయి.. విష సర్పాలతో జరభద్రం
రాజంపేట టౌన్ : ఈ ఏడాది రుతుపవనాలు ముందస్తుగానే వచ్చేశాయి. వాతావరణం చల్లబడడమేగాక వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా వుంటే ఇన్ని రోజులు ఎండ వేడిమికి కటవల్లో, చెట్ల నీడన దాగిన విష సర్పాలు ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో పొదల్లోకి వచ్చి చేరుతాయి. అలా బయటకు వచ్చిన విష సర్పాలు రైతులను, ప్రజలను కాటేసే ప్రమాదం ఉంటుంది. సాధారణ సర్పాలైతే పెద్దగా ప్రాణాపాయం ఉండదు. అదే విష సర్పాలు కాటేస్తే వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందే. లేకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. వర్షాకాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
విష ప్రభావం ఉన్న పాములివే
కట్లపాము, నాగుపాము, రక్తపింజరి, జెర్రిపోతు వంటి పాముల్లో విష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కట్లపాము కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వైద్యుడిని సంప్రదించి వైద్యం చేయించు కోకుంటే మనిషి ప్రాణాపాయస్థితికి చేరుకుంటాడు. అలాగే నాగుపాము కాటేసిన పదిహేను నిమిషాల్లోనే శరీరంలోకి విషం ఎక్కుతుంది. ఇక రక్తపింజరి కాటేసిన రెండు గంటల్లో విషం శరీరంలోకి చేరుతుంది. జెర్రిపోతు కాటేసిన పెద్ద ప్రమాదం ఉండదు. అయినా చికిత్స చేయించుకోవాలి.
పాముకాటును బట్టి వైద్యం
పాముకాటును బట్టి కాటేసింది విషపు పామా కాదా నిర్దారణ అవుతుంది. కాటులో రెండు కోరల మధ్య దూరం, లోతును బట్టి వైద్యులకు తెలుస్తుంది. పాము కరిచిన చోట నీలంగా, వంగ పండు రంగులా మారుతుంది. ఉబ్బులా, లావుగా అవుతుంది. ఈ లక్షణాలను బట్టి వైద్యులు కాటేసింది విషపు పామా కాదా అని నిర్ధారిస్తారు. కొంతమంది పాము కాటువేయగానే ఆ ప్రాంతాన్ని కోస్తే రక్తంతోపాటు విషం బయటకు వస్తుందని కత్తి, బ్లేడు వంటి వాటితో గాటు పెడతారు. అలా ఏమాత్రం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకొక్కమారు పాముకాటుకంటే కోసిన గాయం ప్రమాదకరంగా మారవచ్చు. పాము, తేలు కాటు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఎలాంటి లక్షణాలుంటాయి
● పాము కాటువేసిన ప్రదేశంలో కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది.
● విషం క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షికంగా పక్షపాతం రావచ్చు.
● నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు ఉంటుంది.
● కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులు పంట పొలాల వద్దకు వెళ్లే సమయంలో, పొలాల గట్టుమీద నడుచుకుంటూ వెళ్లేటపుడు కర్రచప్పుడు చేస్తూ నడవడం మంచిది. పొలాలకు వెళ్లే రైతులు టార్చిలైటు వేసుకుంటూ వెళ్లాలి. ధాన్యం బస్తాలు నిల్వ వుండే చోట, గడ్డివాములు ఉండే ప్రాంతంలో ఎలుకలు, కప్పలు తిరుగుతుంటాయి. అందువల్ల పాము తినేందుకు ఆ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో పాదరక్షలు విధిగా వేసుకువెళ్లాలి.
మంచి మందులు ఉన్నాయి
పాముకాటుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి మందులున్నాయి. ఆ వ్యక్తికి ఏఆర్వీ, యాంటి స్నేక్ వీణం మందులతో వైద్యం అందిస్తాం. ఎవరికై నా పాము కరిస్తే నాటు వైద్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. కొంతమంది పాముకాటు గురైన వెంటనే నాటుమందు, ఆకుపసురుతో వైద్యం చేసుకొని సరిపెడతారు. ఇలా చేస్తే ప్రాణాలను సైతం కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.
– డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు, సూపరిండెంట్, రాజంపేట

వర్షాలు కురుస్తున్నాయి.. విష సర్పాలతో జరభద్రం